సిరా న్యూస్,హైదరాబాద్;
కూకట్పల్లి నల్ల చెరువులో నిన్న హైడ్రా కూల్చివేతల పై స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం, ఆదివారం వస్తుందంటే హైదారాబాద్ లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. హైడ్రా కూల్చివేతలు చేసాక డెబ్రిస్ తీసివేయకుండా, చెత్తను జమ చేస్తున్నారని, వాటిని తీయకుండా చెరువును ఏ విధంగా కాపాడుతారని ప్రశ్నించారు. నల్ల చెరువులో నిన్న కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టదారులకు చెందిందని, పట్టాదారులకు ఏ విధమైన న్యాయం చేయనున్నారని, చెరువులలో పట్టాలు ఉన్న వారికి నష్ట పరిహారం చెల్లించి, ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోని చెరువులను కాపాడుతూ అభివృద్ది చేయాలని సూచించారు. నిన్న షెడ్లు కూల్చివేస్తున్న సమయంలో అక్కడ ఉంటున్న వారికి కనీసం వారి సామాన్లను తరలించేందుకు సైతం సమయం ఇవ్వకపోవడం దురదృష్టకరమని, హైడ్రా విధి విధానాలను స్పష్టం చేయాలి. రాత్రి నోటీసులు ఇచ్చి, ఉదయాన్నే కూల్చి వేస్తే అక్కడ ఉంటున్న వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. నిన్న కూల్చివేతలలో నష్టపోయిన వారికి నష్ట పరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు. శనివారం ఆదివారం హైడ్రా కూల్చివేతల పేరుతో హైడ్రామా చేస్తున్నారని అన్నారు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా నిన్న కూల్చివేతలు చేపట్టారని, ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారని మాధవరం కృష్ణారావు ఆరోపించారు.