-మంథనిలో ఓటు హక్కు వినియోగించుకున్న జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
సిరా న్యూస్,మంథని;
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీల అమలును మరచిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ది చెప్పాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా సోమవారం మంథని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పథకాలనుపక్కన పడేశారని అన్నారు. పార్లమెంట్ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్లీ పథకాల ఆశ చూపిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ది చెప్తేనే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రజలు ఓటింగ్లో పాల్గొంటున్నారని ఆయన అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎంగా కేసీఆర్ నాయకత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ది పనులను ప్రజలు చూశారని, అదే విధంగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఐదు మాసాల్లో ఎలా పథకాలు కనుమరుగైపోతున్నాయో చూశారన్నారు. కేంద్రంలో ప్రశ్నించే గొంతు ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే అవకాశం ఇవ్వాలని ప్రజలు ఆలోచన చేస్తున్నట్లు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.