దశలవారీగా రుణమాఫీ..!

మొదట రూ.లక్ష తర్వాత రూ.లక్షన్నర వరకు

రూ.రెండు లక్షల వరకు అప్పు ఉన్న వారికి తదుపరి రెండు విడతలో…!

సిరా న్యూస్,హైదరాబాద్;

జులై మొదటి వారం నుంచి పంద్రాగస్టు వరకు అమలు చేసే యోచన.
ఒక రైతుకు. ఐదు ఎకరాలకు మాత్రమే రైతుభరోసా.! వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీని దశలవారీగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అమలుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆగస్టు 15 కల్లా రుణమాఫీని అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గత కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ అధికారులతోనూ, మంత్రివర్గ సహచరులతోనూ దీనిపై విస్తృతంగా చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్రం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేసిన ప్రభుత్వం, రుణమాఫీ అమలులో కేంద్ర మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీని ప్రకారం. సంస్థలకు ఉన్న భూములకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి, ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత కేటగిరీల్లోని ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టర్డ్‌ ఎకౌంటెంట్లు. ఇలా పలు రంగాలకు చెందిన వారు భూములపై తీసుకొన్న రుణానికి మాఫీ ఉండదు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొన్న తర్వాత సుమారు 26 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలు చేయాల్సి రావచ్చని అంచనా వేస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం జులై మొదటి వారం నుంచి దశలవారీగా అమలు చేసే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. మొదట రూ.లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయనున్నట్లు తెలిసింది. దీనికి సుమారు రూ. ఆరు వేల కోట్లు అవసరమని సమాచారం. తర్వాత రూ. లక్షన్నర వరకు అమలు చేసే అవకాశం ఉంది. దీనికి మరో రూ.6,500 కోట్లు అవసరమని సమాచారం. ఈ రెండు దశల్లో సుమారు 16 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలవుతుందని తెలిసింది. రూ.రెండు లక్షల వరకు ఉన్న వారికి తర్వాత రెండు దశల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. జులైలో కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, మిగిలిన రుణ మాఫీ అమలుకు నిధులను సమీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సాగు చేసే రైతుకు మాత్రమే రైతుభరోసా,
రైతుభరోసా అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గుట్టలు, కొండలు, రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్ల లాంటివన్నీ మినహాయించనున్నారు. సాగు చేసే రైతుకు మాత్రమే రైతుభరోసా దక్కాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, దీనికి తగ్గట్లుగానే మార్గదర్శకాలుంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా, ఒక రైతుకు ఐదు ఎకరాలకు మాత్రమే రైతుభరోసాను పరిమితం చేయనున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *