సిరా న్యూస్;
– వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ పై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి
వనమహోత్సవం కార్యక్రమం కింద మన జిల్లాలో వివిధ శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కు తీసుకోవాల్సిన చర్యల పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లాలో మంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వన మహోత్సవం కార్యక్రమం క్రింద నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాలలో రోడ్డు పక్కన అవకాశం ఉన్న చోట మొక్కలు నాటి, వాటి సంరక్షణకు ట్రీ గార్డు ఏర్పాటు చేయాలని అన్నారు. కమ్యూనిటీ ప్లాంటేషన్ కింద గతంలో పల్లె ప్రకృతి వనాలు, అర్భన్ పార్క్, అటవీ ప్రాంతాలలో నాటిన మొక్కలను పరిశీలించి, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, కాల్వలు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని, సీజనల్ వ్యాధులను నియంత్రణకు పటిష్టంగా పారిశుధ్య నిర్వహణ అమలు చేయాలని అన్నారు. గ్రామాలలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని, రెగ్యులర్ గా ఫాగ్గింగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని, నీటి నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వైద్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన చోట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని, ఫీవర్ సర్వే నిర్వహించి తీరని వ్యాధి లక్షణాలు గల వారిని ముందుగానే గుర్తించి అవసరమైన పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ జరిగితే వెంటనే చికిత్స అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు జే.అరుణశ్రీ, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా అటవీ అధికారి శివయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కె రవీందర్, వైద్య అధికారులు ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.