సిరా న్యూస్,తిరుపతి;
హంద్రీనీవా నీటి చుట్టూ వైసీపీ – టీడీపీ మధ్య నడుస్తున్న రాజకీయం రంజుగా మారింది. హంద్రీనీవా ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్ నీళ్లు తెచ్చిందీ మేమేనంటూ వైసీపీ, నిధులు కేటాయించింది 90 శాతం పనులు పూర్తి చేసింది చంద్రబాబు హయంలోనేనని టీడీపీ. ఇలా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. పులివెందులకు నీళ్లు ఇచ్చింది తానేనంటూ చంద్రబాబు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ ఇస్తున్న వైసీపీ కుప్పంకు నీళ్లు తెరపైకి తీసుకొచ్చింది. దీంతో నీళ్ళ లొల్లి కాస్తా.. పొలిటికల్ హీట్ ను పెంచింది.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాకా లో ఇప్పుడు హంద్రీనీవా ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది. ఫిబ్రవరి 26న సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన కాక రేపుతోంది. కృష్ణా జలాలను పులివెందులకు తెచ్చింది తానేనని చంద్రబాబు, కుప్పంకు నీళ్లు ఇచ్చింది తమ ప్రభుత్వమేనని వైసీపీ చెప్పు కుంటుండటం ఇప్పుడు పొలిటికల్ చర్చకు దారితీసింది. పులివెందులకు నీళ్లు ఇచ్చింది తానేనని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ సర్కార్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. 14 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు కుప్పంకు నీళ్లు కూడా అందించలేక పోయారంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాకు చేసిందేమీ లేదంటోంది. హంద్రీనీవా నీటిని సీఎం వైఎస్ జగన్ పూజ చేసి కుప్పం ప్రజలకు అందిస్తారని మంత్రి పెద్దిరెడ్డి అంటున్నారు.కుప్పంకు నీళ్లు అందించాలన్న దృఢ సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారంటున్నారు. ఫిబ్రవరి 26 న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పూజలు చేయించి హంద్రీనీవా నీటిని కుప్పం నియోజకవర్గానికి అందిస్తామంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి. అయితే తెలుగుదేశం పార్టీ వాదన మరోలా ఉంది. పులివెందులకు కృష్ణా జిల్లాలోని గండి కోట ద్వారా అందించిన ఘనత తమదేనంటున్నారు టీడీపీ నేతలు. కుప్పంకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చిన క్రెడిట్ వైసీపీది మాత్రం కాదంటోంది.ఒక టీఎంసీ కెపాసిటీ తో హంద్రీనీవా నీటిని కుప్పం బ్రాంచ్ కెనాల్ కు తరలించాలని సంకల్పించింది మేమే అంటోంది టిడిపి. కృష్ణా జలాలను తీసుకుని రావాలనుకున్న చంద్రబాబు రూ. 613 కోట్లు కేటాయించి 2014-19 మద్య కాలంలో పనులు చేపట్టారని టీడీపీ నేతలు అంటున్నారు. రూ. 520 కోట్లు ఖర్చు చేసి 87శాతం పనులు కూడా పూర్తి చేశారంటున్నారు. పైగా కోర్టులకు వెళ్లి కెనాల్ పనులు నిలిచి పోయేలా చేసింది వైసీపీ నేతలేనని ఆరోపిస్తోంది. మిగిలిపోయిన 13 శాతం పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు వైసీపీ సర్కార్కు నాలుగేళ్ల పది నెలలు కాలం పట్టిందని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు. పూర్తి చేసిన పనులు కూడా నాసిరకంగా ఉన్నాయని హంద్రీనీవాకు పూర్తి స్థాయిలో నీళ్లు రాకపోవడంతో ఇప్పటికే సీఎం పర్యటనలు మూడుసార్లు వాయిదా వేసుకున్న వైసీపీ నేతలు ఇకనైనా మోసపూరిత మాటలు మాను కోవాలంటున్నారు టీడీపీ ఎంఎల్సీ కంచర్ల శ్రీకాంత్. పులివెందులకు చంద్రబాబు హయంలోనే నీళ్లు అందించారని గంటాపథంగా చెబుతున్నారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్.