సిరా న్యూస్,అదిలాబాద్,
మంచిర్యాల పురపాలక సంఘం చైర్మన్, బీఆర్ఏస్ పార్టీకి చెందిన పెంటరాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్ లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లు కలెక్టర్ సంతోష్ బాదవత్ కు నోటీసు అందజేశారు. 26 మంది కౌన్సిలర్ లు కలెక్టర్ కార్యాలయంకు ప్రత్యేక బస్ లో వెళ్లారు. కలెక్టర్ ను కలిసి సంతకాలతో కూడిన వినతిపత్రం ను సమర్పించారు. అవిశ్వాసంకు అవసరమైన కౌన్సిలర్ ల సంఖ్యా బలం తమకు ఉందని కాంగ్రెస్ పక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య, ఉప నాయకుడు వేములపళ్ళు సంజీవ్ కలెక్టర్ కు తెలిపారు. మెజార్టీ సభ్యులు ఉన్నందున చైర్మన్ పెంటరాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్ లపై అవిశ్వాసం కోసం సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ 15 రోజుల్లో సంతకాలు చేసిన కౌన్సిలర్ వివరాలను విచారిస్తారు. ఆ తరువాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాసం తీర్మానంకు అవకాశం ఇస్తారు. అయితే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గెలుపొందడంతో బీఆరెస్ కౌన్సిలర్ లు 17 మంది కౌన్సిలర్ లు కాంగ్రెస్ లో చేరారు. ఐదుగురిని అప్పట్లో మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు బీఆరెస్ లో చేర్చుకోగా.. తాజాగా ప్రేమసాగర్ రావు ఏకంగా 17 మందిని కాంగ్రెస్ లో చేర్చుకుని దివాకర్ రావుకు అవిశ్వాసం అనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బతగిలింది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే 13 మంది కౌన్సిలర్లు హస్తం గూటికి చేరారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంచిర్యాల మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లు ఉండగా.. ప్రస్తుతం 24 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నారు. అటు బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య 12కు పడిపోయింది. దీంతో మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసానికి కౌన్సిలర్లు సిద్ధమైనట్టు తెలుస్తోంది.అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మున్సిపల్ చైర్మన్ రాజయ్యతో పాటు వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్కు పదవి గండం తప్పదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో.. ఆ పార్టీలోకి జంపింగ్లు ఎక్కువయ్యాయి. ఇప్పుడు మంచిర్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ సొంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అభివృద్ధి కోసమే వాళ్లంతా పార్టీలోకి వస్తున్నట్టు చెప్తున్నారు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు.అవిశ్వాసానికి అవసరమైన సంఖ్యాబలం పెరగడంతో క్యాంపు రాజకీయాలకు అవసరం లేకుండా పోయింది. చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టనున్నట్లు వారు మీడియాతో తెలిపారు.