సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్లో రూ. 2 కోట్ల రైతుల సొమ్ము స్వాహా!?
+ రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
+ పోస్టల్ మేనేజర్ విజయ్ జాదవ్ అరెస్ట్కు డిమండ్
+ జిల్లా ఎస్పీ, కలెక్టర్, పోస్టల్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హెడ్పోస్ట్ ఆఫీస్ బ్యాంక్లో వందలాది మంది రైతులకు సంబందించిన దాదాపు రూ. 2కోట్ల డబ్బులు స్వాహా అయినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గురువారం రాత్రి ఆయన రైతులతో కలిసి పోస్టాఫీస్లో ఆకస్మికంగా తనిఖీ చేసారు. పలు రికార్డులను పరిశీలించి, అక్కడి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీసీఐకి పత్తి అమ్మిన రైతుల డబ్బులు వారి పోస్టాఫీస్ ఖాతాల్లో జమ కావడంతో, చాలా మంది రైతులు అక్కడి మేనేజర్ విజయ్ జాదవ్ను నమ్మి మోసపోయినట్లు తెలిపారు. డబ్బులు తీసుకునేందుకు పోస్టాఫీస్కు వచ్చిన రైతుల వేలిముద్రల సహాయంతో విజయ్ రైతుల సొమ్మును తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దాదాపు రూ. 2కోట్ల మోసం జరిగిందని, సదరు అధికారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేసారు. జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్తో పాటు పోస్టల్ శాఖ ఉన్నత అధికారులకు ఈ విషయమై ఆయన ఫిర్యాదు చేసారు. మోసం పోయిన రైతులంత ఆదిలాబాద్కు శుక్రవారం ఉదయం తరలిరావాలని ఆయన కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేస్తామని, రైతులెవరు కూడ ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు.