-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సిరా న్యూస్,పెద్దపల్లి;
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ , జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓదెల మండల కేంద్రానికి చెందిన పి.విజయ లక్ష్మీ గ్రామ శివారులో సర్వే నెంబర్ 426 లో పట్టా భూమి లో మెగ్గు రమా దేవి చేపట్టిన అక్రమ నిర్మాణానికి ఇంటి నెంబర్ కేటాయించవద్దని, దానిని కూల్చివేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రామగుండం పట్టణానికి చెందిన సిద్ది భీమయ్య జంగాలపల్లి గ్రామం సర్వే నెంబర్ 218 లో 16 గుంటల తన భూమిలో బాదె సాంబయ్య అనే వ్యక్తి బాత్ రూమ్ నిర్మించు కున్నాడని, దానిని పూర్తిగా కూల్చివేసి భూమి కబ్జాకు గురికాకుండా కాపాడాలని న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా రామగుండం మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు రామగుండానికి చెందిన జి.నాగలక్ష్మీ తన భర్త 02 ఏప్రిల్ 2020న మరణించాడని, తన భర్త డెత్ సర్టిఫికెట్ ఇప్పటి వరకు రాలేదని, దీని వల్ల తనకు వితంతువు పెన్షన్ రావడం లేదని, తనకు వెంటనే తన భర్త డెత్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలైన గృహ జ్యోతి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ లబ్ధి చేకూరని అర్హులు ఎవరైనా ఉంటే గతంలో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న రశీదుతో ప్రజా పాలన సేవా కేంద్రం ద్వారా తమ దరఖాస్తులు సమర్పించవచ్చని అన్నారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.