హిందూపుర్ స్థానానికి పరిపూర్ణానంద ప్రయత్నాలు

సిరా న్యూస్,హిందూపురం;
కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఈసారి హిందూపురం నుంచి బరిలో దిగాలని ప్రయత్నాలు చేసుకున్నారు. గత రెండేళ్లుగా ఆయన హిందూపూర్ ఎంపీగా నిలబడేందుకు స్థానికంగా సిద్ధమయ్యారు. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా తనకు టికెట్ వస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ అండదండలు ఆయనకు టికెట్ వచ్చేలా చేస్తాయని అభిమానులు భావించారు. అయితే టీడీపీ హిందూపూర్ నుంచి అభ్యర్థిని ఖరారు చేయడంతో ఆయన ఖంగు తిన్నారు. ఈసందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూపురంలోని 2.20 లక్షలకు పైగా ఓట్లలో హిందువులందరూ తమకు అక్కరలేదని, మైనారిటీల ఓట్లు 40 వేలు ఉంటే చాలని టీడీపీ
వాళ్లు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. స్వామిజీకి ఎంపీ టికెట్ ఇస్తే బాలకృష్ణకు ముస్లింలు దూరమై ఓటమి పరిస్థితులు వస్తాయని అనుకుంటే.. ఆ స్వామిజీకి అడ్డుపడిన టీడీపీకి హిందువులు ఓటు వేయకుండా ఉండే పరి స్థితులు కూడా ఏర్పడతాయని హెచ్చరించారు. హిందూపురం ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించినా.. చిట్టచివరికి ఈ స్థానం బీజేపీకే ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నానన్నారు. ఎంపీగా పోటీ చేసి హిందూపురాన్ని అభివృద్ధి చేయాలనే భావనతో ఇక్కడకు వచ్చానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *