సిరా న్యూస్, జైనథ్
పుస్తక పఠనానికి ప్రాధాన్యత ఇవ్వాలి
* దక్షిణ భారత నయీ తాలీం కోఆర్డినేటర్ డాక్టర్ సి ఏ ప్రసాద్
పిల్లల్లో భాషా నైపుణ్యాలు పెంపొందించడానికి పుస్తక పఠనానికి ప్రాధాన్యత ఇవ్వాలని దక్షిణ భారత నయీ తాలీం కోఆర్డినేటర్ డాక్టర్ సి ఏ ప్రసాద్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ ఉన్నత పాఠశాల లో పుస్తక మిత్ర – ఎన్ఆర్ఐ వాసవి సంస్థ ద్వారా అందించిన గ్రంథాలయ పుస్తకాల వినియోగం గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. పాఠ్య బోధనలో ఒక భాగంగా గ్రంథాలయ పుస్తకాల వినియోగం జరగాలని ఆయన పేర్కొన్నారు. బోధనాభ్యాసన ప్రక్రియలో కథ, మాట, పాట, ఆట, గేయాలకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. భాషా బోధనలో వస్తున్న నూతన పద్ధతులను పిల్లల వరకు చేర్చడానికి కథల పుస్తకాలు ఎంతో దోహద పడతాయని అన్నారు. పిల్లల చే కథలు చెప్పించడం తో పాటు, గేయాలు కూడా పాడించారు. అలాగే ఆనంద్ పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రంథాలయ నిర్వహణను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పోరెడ్డీ అశోక్, జ్ఞ్యానేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.