పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
కంటి శస్త్ర చికిత్స సేవా విభాగాన్ని త్వరితగతిన ప్రారంభించాలి
డెంటల్ ఫీలింగ్ సేవలు ప్రారంభించడం ప్రశంసనీయం
జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి : జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్ నాలుగు లక్షల వ్యయంతో నూతనంగా కొనుగోలు చేసిన వైద్య పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ పరికరాలను వినియోగించాలని కలెక్టర్ వైద్యులకు సూచించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో నూతనంగా నిర్మాణం అవుతున్న కంటి శస్త్ర చికిత్స విభాగాన్ని కలెక్టర్ పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేసి కంటే శస్త్ర చికిత్స విభాగాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా కంటి చికిత్స విభాగంలో కలెక్టర్ ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేసి అవసరమైన పరికరాల కొనుగోలు చేశారు. జిల్లా ఆస్పత్రిలోని డెంటల్ ఓపి పరిశీలించిన కలెక్టర్ డెంటల్ విభాగంలో రెండు లక్షలతో కొనుగోలు చేసిన పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. డెంటల్ ఫీలింగ్ సేవలు ప్రారంభించడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ వైద్యులను ప్రశంసించారు. ఆస్పత్రి నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ ఇదే స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చిత్తశుద్ధితో పని చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్.ఎం.ఓ డాక్టర్ రవీందర్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పలువురు డెంటల్ కంటి శస్త్ర చికిత్స డాక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.