సిరా న్యూస్, గద్వాల;
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా బెటాలియన్ పెట్రోల్ బంకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. వెంటనే మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. బస్సులోనే ఇరుక్కుపోయి ఓ మహిళ సజీవ దహనం అయింది. ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకరిని హైదరాబాద్ కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణికులు వున్నట్లు సమాచారం. ప్రయాణికులు వివిధ మార్గాల ద్వారా బస్సులోంచి బైటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేసారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ ఏపీ 39ఎక్స్ 4663. 11 గంటలకు ఆరాంఘర్ నుంచి బయలుదేరింది. రాత్రి 2:35 నిమిషాలకు ఎర్రవల్లి చౌరస్తాలో బస్సుకు మంటలు అంటుకున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. డ్రైవర్ నిద్రమబ్బులో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసుల ప్రాథమిక అంచనా.