సిరాన్యూస్, ఇచ్చోడ
పుట్టగొడుగుల్లా ప్రైవేట్ ఆస్పత్రులు
అర్హత లేని డాక్టర్లతో నిర్వహణ
* రోగుల ప్రాణాలతో చెలగాటం
* ప్రభుత్వ నిబంధనలు గాలికి
* పట్టించుకోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న క్రమంలో అనేక ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వాటికి సరైన అనుమతులు ఉన్నాయా..? లేవా..? డాక్టర్లకు అర్హత ఉందా..? లేదా..? అనే విషయాలపై ఇక్కడి ప్రజలకు పెద్దగా అవగాహన లేదు. ప్రజలను ఆకర్షించడానికి పెద్దపెద్ద లైటింగ్ బోర్డ్స్ పెట్టి మెరుగైన వైద్యం పేరుతో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. మండల కేంద్రంలో శంకర్ దాదా ఎంబీబీఎస్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నారు. ఎలాంటి అర్హత లేకున్నా వచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ అనుమతులు, అర్హులైన వైద్యులు, శిక్షణ పొందిన సిబ్బంది లేకపోయినా అన్నీ ఉన్నాయి అన్నట్లుగా బోర్డులు పెట్టి రోగుల జేబులు ఖాళీ చేస్తున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, ల్యాబ్ లపై ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు లేబొరేటరీలు, డెంటల్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫిజియోథెరిపీ యూనిట్ల ఏర్పాటు చేయాలంటే వివిధ విభాగాల నుంచి అనుమతులు తప్పని సరి. వీటిని ఏర్పాటు చేసే భవనాలకు పంచాయతీ అనుమతులు, అగ్నిమాపక శాఖ, ఐఎంఏ సభ్యత్వం, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, వైద్య పరీక్షల సామగ్రి వివరాలు, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి, స్పెషలిస్టు వైద్యులు, నర్సులు, ఫార్మసీ సిబ్బంది, ఆడిట్ నివేదిక, ఇలా అన్ని రకాల అనుమతులతో రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రైవేట్ ఆస్పత్రులు, చట్టం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వీటిని నిర్వహించడంతో నిర్వాహకులు అనుమతులు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొన్నిసార్లు ఆస్పత్రులకు నోటీసులు పంపుతున్నప్పటికీ స్పందన లేదని తెలుస్తోంది. నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముడుపులు చెల్లించి తమ జోలికి రాకుండా చూసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.