-పెండింగ్ బిల్లులను,డి ఏ లను వెంటనే విడుదల చేయాలి
-సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి
-టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్
సిరా న్యూస్,మంథని;
ఉపాధ్యాయ,విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని,రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ,ఉద్యోగులకు బకాయిలుగా ఉన్న నాలుగు డిఏ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో టిపిటిఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి బండిపెల్లి పరశురామ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కుటుంబ ఆర్థిక అవసరాల కోసం ప్రభుత్వానికి పంపిన జిపిఎఫ్, ప్రభుత్వ జీవిత బీమా, సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు నెలల తరబడి ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం టీచర్లకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. 317 జీవో బాధిత టీచర్లకు స్థానికత ఆధారంగా వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని, కమిటీలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో జాప్యం చేస్తే ఉద్యమించాల్సి వస్తుందన్నారు. గత సంవత్సరం మధ్యలోనే ఆగిపోయిన టీచర్ల బదిలీలు,ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే చేపట్టాలని, టెట్ లేకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున పోస్టులు కేటాయించి భర్తీ చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు సూద రాజేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శులు గుంటి ఎల్లయ్య, రావుల రమేష్ ,ఎం.రాములు టి పి టి ఎఫ్ సీనియర్ నాయకులు కోల రాజమల్లు,దేవదానం, టి పి టి ఎఫ్ బాధ్యులు చంద్రశేఖర్ , రాంబాబు ,కుమారస్వామి,శ్రీనివాస్, బాలయ్య, రాంనారాయణ ,కొంరెళ్లి, తిరుపతి ,సుధాకర్ రెడ్డి,మర్రి అవినాష్ తదితరులు పాల్గొన్నారు.