ఈ తరానికి ఆదర్శనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య

సిరా న్యూస్;

-నేడు ఆయన వర్ధంతి
పుచ్చలపల్లి సుందరయ్య తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన ఆయన తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కులవ్యవస్థను నిరసించిన ఆయన తన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడు. సహచరులు ఈయనను “కామ్రేడ్ పి.ఎస్.” అని పిలిచేవారు.
పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం, అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913, మే 1 న జన్మించాడు. తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి శేషమ్మ. తల్లిదండ్రులు ఈయనకు సుందరరామిరెడ్డి అని పేరు పెట్టారు. ఆరేళ్ళ వయసులో తండ్రి మరణించాడు. ప్రాథమిక విద్యను వీధిబడిలోనే పూర్తిచేసాడు. తరువాత అక్కయ్య వాళ్ళ ఇంటివద్ద ఉంటూ తిరువళ్ళూరు, ఏలూరు, రాజమండ్రి, మద్రాసు లలో చదివాడు. ఈయన్ని “కమ్యూనిస్టు గాంధీ” అంటారు. పార్లమెంటు భవనంలో చప్రాసీల సైకిళ్లతోపాటు ఈయన సైకిలు కూడా స్టాండులో ఉండేది. రాష్ట్ర విధానసభలోనూ అదే సైకిలును ఉపయోగించాడు. పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్లికాగానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొన్నాడు.తండ్రినుంచి వంశపారంపర్యంగా లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచివేశాడు.1985, మే 19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి కన్నుమూశాడు. హైదరాబాద్ భాగ్‌లింగంపల్లి లో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి. గాంధీజీ నిరాడంబరత, ప్రకాశం వంటి ప్రజా సాన్నిహిత్యం, పటేలు వంటి పట్టుదల, నెహ్రూ వంటి రాజకీయ పరిణతి సుందరయ్యలో ఉన్నాయని పాతతరం నాయకులు వర్ణిస్తారు.
గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితుడై, సుందరయ్య 1930లో తన 17వ యేట హైస్కూలు రోజుల్లోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలలోను, ఉప్పు సత్యాగ్రహం లోను, సహాయ నిరాకరణోద్యమం లోను పాల్గొని కారాగార శిక్ష అనుభవించాడు. అతనిని నిజామాబాద్, బోర్స్టల్ స్కూలు‌ లో ఉంచారు. ఆ సమయంలో అతనికి కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది. విడుదల అయినాక తన స్వగ్రామంలో వ్యవసాయ కార్మికులను సంఘటితం చేయడానికి కృషి చేశాడు. అమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో సుందరయ్య భారతీయ కమ్యూనిస్టు పార్టీ లో చేరాడు. అప్పటికి ఆ పార్టీ నిషేధంలో ఉంది. 1930 దశకంలో దినకర్ మెహతా, సజ్జద్ జహీర్, ఇ.ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, సోలీ బాట్లివాలా వంటి ప్రముఖ కమ్యూనిస్టు నేతలు కాంగ్రేస్ సోషలిస్టు పార్టీ జాతీయ కార్య నిర్వాహక వర్గం సభ్యులుగా ఉండేవారు. సుందరయ్య కూడా వీరితో చేరి, క్రమంగా కాంగ్రేస్ సోషలిస్టు పార్టీ కార్యదర్శి అయ్యాడు.
ఆదర్శ జీవనం: కేవలం ఆయన పార్లమెంటు సభ్యుడుగా ఉన్నంత కాలం మన దేశ పార్లమెంటు లో సైకిల్ స్టాండు ఉండేది. పార్లమెంటు సమావేశాలకు ఆయన సైకిలు మీదే వెళ్ళేవాడు. ఆయనతో పాటే ఆ స్టాండు కు కాలం చెల్లింది. ఆయన నిరాడంబర జీవితానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. తాను ఎక్కడికి వెళ్ళినా, తన సామాను తానే మోసుకొనేవాడు. తన బట్టలు తానే ఉతుక్కునేవాడు.
=====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *