సిరా న్యూస్,ఏలూరు;
సాధారణంగా సొంత గ్రామంలో నేతలు సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందునా గోదావరి జిల్లాల్లో అయితే ఆ సందడే వేరు. తాము ఎక్కడ ఉన్నా సంక్రాంతి ఆ నాలుగు రోజులు స్వగ్రామాల్లో గడపడం ఆనందంగా ఫీలవుతారు. అటువంటిది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత నాలుగు సంవత్సరాలుగా సంక్రాంతి నాడు సొంత గ్రామానికి దూరమయ్యారు. సొంత పార్టీని, సొంత ప్రభుత్వాన్ని, అధినేతను ధిక్కరించడంతో సొంత నియోజకవర్గాన్ని సందర్శించాలంటే సవాలక్ష నిర్బంధాలు ఎదుర్కొన్నారు. పోలీస్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే ఎన్నికలు ముంగిట ఈ సంక్రాంతి మాత్రం నరసాపురంలోనే జరుపుకోవాలని బలమైన ఆకాంక్షతో ఉన్నారు.గతంలో చాలాసార్లు నరసాపురం వెళ్లేందుకు రఘురామకృష్ణంరాజు ప్రయత్నించారు. కానీ పోలీసులు ఎన్ని కేసులు పెట్టారో తెలియడం లేదు. రహస్యంగా ఎన్ని ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారో బయట పెట్టడం లేదు. రాత్రికి రాత్రి అరెస్టు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓసారి పుట్టినరోజు అని కూడా చూడలేదు. హైదరాబాద్ వెళ్లి గుంటూరు తీసుకొచ్చి మరీ థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఏకంగా రాజద్రోహం కేసు పెట్టి రఘురామకృష్ణంరాజుకు నరకం చూపించారు. అందుకే చాలాకాలంగా ఢిల్లీ, హైదరాబాద్ కి ఆయన పరిమితం అయ్యారు. కానీ ఆయన కుమారుడు మాత్రం నియోజకవర్గానికి వెళ్లి పనులన్నీ చక్కబెడుతున్నారు.వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని రఘురామకృష్ణంరాజు భావిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన జతకట్టింది. బిజెపి కూడా కలిసి రానుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజు ఎంపీగా పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. అందుకే ఈ సంక్రాంతికి నరసాపురం రావాలని రఘురామరాజు డిసైడ్ అయ్యారు. ఎన్నికల ముంగిట మరోసారి ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడితే అది రాజకీయంగా వారికే నష్టం జరుగుతుందని అంచనాకు వచ్చారు.ఎప్పుడూ సంక్రాంతికి సొంత గ్రామంలో ఉండడం రఘురామరాజు ఆనవాయితీగా చేసుకున్నారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా వైసీపీ సర్కార్ ఉక్కు పాదం మాపడంతో సొంత ప్రాంతంలో అడుగుపెట్టలేకపోయారు. ఇప్పుడు ఎన్నికల ముందు పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తే అది అంతిమంగా రఘురామకే ప్లస్ అవుతుంది. అందుకే ఈసారి ధైర్యంగా నరసాపురంలో అడుగు పెట్టేందుకు రఘురామకృష్ణంరాజు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.