సిరా న్యూస్,వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిరోజు వేలాదిమంది భక్తులు వచ్చి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ దేవాలయంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడె మొక్కు ద్వారా ఏటా ఆదాయంలో ఎక్కువ శాతం ఉంటుంది. అధిక శాతం మంది భక్తులు నిజకోడే ను కూడా సమర్పిస్తారు. గతంలో గోశాలలో పరిమిత సంఖ్య కంటే ఎక్కువ ఉన్న కోడెలను వేలం వేసేవారు. ఆ కోడెలు కబేలాలకు తరులు తున్నాయని, నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు గోశాల ఫెడరేషన్ వారికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు గోశాల ఫెడరేషన్ పేరుమీద లెటర్ ప్యాడ్స్ ముద్రించి, కోడెలను కబేళాలకు తరలిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం దాదాపు 200 కోడెలను గోశాలలకు అప్పగించారు. తాజాగా, మహబూబాబాద్ జిల్లా దుబ్బ గ్రామానికి చెందిన సోమేశ్వర గో సంరక్షణ సమితికి 24 కోడెలను అప్పగించగా, పరిమితికి మించి కోడేలను రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఆ వాహనాన్ని మహబూబాబాద్ పోలీసులు సిజ్ చేసి డ్రైవర్ పై కేసు నమోదు చేయడంతో అసలు సోమేశ్వర గో సంరక్షణ సమితి లేదన్న విషయం బయటపడింది. కాగా, గోశాలల నిర్వహణ పేరుతో పత్రాలు తీసుకొచ్చి దేవాలయ అధికారులకు ఇవ్వడంతో వారు గుడ్డిగా కోడెలను ఉచితంగా సమర్పించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ సంఘటనపై బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ, నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న రాజన్న కోడెల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇకముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.