సిరాన్యూస్, ఆదిలాబాద్
నామినేషన్ల దాఖలకు నిర్దేశిత నిబంధనలు పాటించాలి : కలెక్టర్ రాజర్షి షా
ఎన్నికలకు రాజకీయ పార్టీలు సహకరించాలి
ఈనెల 29న నామినేషన్ల ఉపసంహరణ
ప్రచారం కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలి
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి కోరారు. పార్లమెంటు ఎన్నికలను 2024 పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా పాలనాధికారి రాజర్షి షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, అవలంభించాల్సిన విధానాల గురించి క్షుణ్ణంగా వివరిస్తూ అవగాహన కల్పించారు. నామినేషన్ ఫారం -2ఏను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుండి ఉచితంగా పొందవచ్చని సూచించారు. కలెక్టరెట్ లో ఆర్.ఓ. కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని , ఈ నెల 18 నుండి నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో నామినేషన్లను అందించాల్సి ఉంటుందని తెలిపారు. సెలవు రోజు ఆదివారం మినహాయించి, మిగితా అన్ని పని దినాలను కలుపుకుని, తుది గడువు అయిన ఈ నెల 25 తేదీ మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయని అన్నారు. నిర్ణీత గడువు, నిర్ణీత సమయంలోపు రిటర్నింగ్ అధికారి వద్దకు చేరుకున్న వారి నామినేషన్ ఫారాలు మాత్రమే స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, అభ్యర్థి వెంట మరో నలుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తారని తెలిపారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేసే నియోజకవర్గంలోని ఎవరైనా ఒక ఓటరు నామినేషన్ ను ప్రతిపాదిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. అదే రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే వారికి, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ఓటర్లు నామినేషన్ ను ప్రతిపాదించాల్సి ఉంటుందని సూచించారు.అభ్యర్థులు ఇటీవలి కాలంలో మూడు నెలల లోపు దిగిన ఒకటి పాస్పోర్ట్ సైజు ఫోటో అఫిడవిట్ పై అతికించాలని, నామినేషన్ పత్రంపై స్టాంప్ సైజు ఫోటో అతికించాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంటు సెగ్మెంట్ కు చెందినవారైన పక్షంలో తప్పనిసరిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ ఈ.ఆర్.ఓ నుండి ఓటరు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. రిజిస్టర్డ్, గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్-3 లో ‘సి’ కాలం ఎదురుగా ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తులలో ఏవైనా మూడు గుర్తులను ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేస్తూ వివరాలు పొందుపర్చాలన్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు అకౌంట్ తెరవాలని, దీని ద్వారానే ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తూ పక్కాగా రికార్డులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షల వరకు ఎన్నికలలో ఖర్చు చేయవచ్చని, సంబంధిత బ్యాంకు అకౌంట్ లావాదేవీల ఆధారంగానే అభ్యర్థుల వ్యయాన్ని లెక్కించడం జరుగుతుందన్నారు. బ్యాంకు అకౌంట్ తెరిచే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తేవాలని సూచించారు. అభ్యర్థులు తమపై ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే నామినేషన్ పత్రంలోని పార్ట్-3 ఏలో వాటి వివరాలను తప్పనిసరిగా పొందుపర్చాలని అన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థి, లేదా ప్రతిపాదించిన వారే స్వయంగా హాజరై నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని, అభ్యర్థులు ఆర్.ఓ సమక్షంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుందని తెలిపారు. గడిచిన పది సంవత్సరాల కాలంలో ఎవరైనా అభ్యర్థులు ప్రభుత్వ క్వార్టర్లలో ఉన్నట్లయితే, నీటి బిల్లులు, కరెంటు బిల్లులు వంటివి బకాయిలు లేవని నో డ్యూ సర్టిఫికెట్ జతపర్చాలని సూచించారు. నామినేషన్ సమర్పించే ముందు అన్ని అంశాలను క్షుణ్ణంగా చూసుకోవాలని హితవు పలికారు. అభ్యర్థులకు సహాయపడేందుకు ఆర్.ఓ కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్ సైతం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. దాఖలైన నామినేషన్లను ఈ నెల 26న పరిశీలించడం (స్క్రుటినీ) జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు 29వ తేదీ చివరి గడువు అని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తుగానే దరఖాస్తులు చేసుకుని అనుమతి పొందాలని సూచించారు. కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు వంటివి ముద్రించే విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 127 – ఏ సూచనలు పాటించాలన్నారు. ఎన్నికల ప్రచార ప్రకటనలు, ప్రచార అంశాలు, ఎల్.ఈ.డీ డిస్ ప్లే కంటెంట్ తదితర వాటికి ఎంసిఎంసి ద్వారా అనుమతులు తీసుకోవాలని సూచించారు. అలాగే, అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, వాహనాల కోసం సంబంధిత సహాయ రిటర్నింగ్ అధికారుల (ఏ.ఆర్.ఓ) నుండి అనుమతి తీసుకోవాలని, పార్లమెంటు నియోజకవర్గం పరిధి మొత్తంలో నిర్వహించే ప్రచార కార్యక్రమాలు, ఎల్.ఈ.డీ వాహనాలు, ఛాపర్, హెలిప్యాడ్, హెలికాప్టర్ వంటి వాటి అనుమతులను ఆర్.ఓ కార్యాలయం నుండి పొందాలని సూచించారు. కనీసం 48 గంటల ముందు సువిధ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, అదిలాబాద్, నిర్మల్ , కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.