సిరాన్యూస్,తాంసి
బడీడు పిల్లలను బడిలో చేర్పించండి: కలెక్టర్ రాజర్షి షా
* విద్యార్ధులకు ఏకరూప దుస్తులను అందించాలి
* ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు , బడి ఈడు పిల్లలందరిని బడిలో చేర్పించాలనే ధృడ సంకల్పంతో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోందని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్య శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బడి బాట కార్యక్రమంను జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథి గా హాజరై ప్రారంభించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్ధులకు ఏకరూప దుస్తులను అందించి మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరానికి గాను చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడమే ప్రభుత్వం ఉద్దేశం అని అన్నారు. జూన్ 6 నుండి 19 వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమంను జిల్లా యంత్రాగం సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతను వివరిస్తూ , ఇంటింటి ప్రచారం చేయాలని , ప్రభుత్వ పాఠశాలల్లో సాధించిన ప్రగతిని వివరించాలన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, నాణ్య మైన మధ్యాహ్నం భోజనంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆటపాటలతో విద్యను అందించడం జరుగుతుందని, బడి బయట పిల్లలను గుర్తించి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ రోజు వారి కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం బడీడు పిల్లల ఇళ్లను సందర్శించాలన్నారు. 8 నుండి 10వ తేదీ వరకు కరపత్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన, డ్రాప్ ఔట్స్ పిల్లలను గుర్తించి, బడిలో చేర్పించుట (సిడబ్ల్యూఎస్ఎన్) ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి సమీప భవిత కేంద్రాల్లో చేర్పించాలని తెలిపారు. 11వ తేదీన సమీక్ష నిర్వహించి 6 నుండి 10వ తేదీ వరకు జరిగిన కార్యక్రమాలపై గ్రామసభ, నమోదు కానీ బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడం నిర్వహించాలన్నారు. 12వ తేదీన పాఠశాల పునః ప్రారంభం కావడంతో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఏ ఏ పీ సి కమిటీలచే చేపట్టిన పనులను ప్రారంభిస్తూ పాఠ్య , నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ చేయాలన్నారు తదుపరి కార్యక్రమాలపై ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని అన్నారు. 13వ తేదీన ఎఫ్ ఎల్ ఎన్ /ఎల్ఐపి నిర్వహించాలి. 14 వ తేదీన సామూహిక అక్షరాభ్యాసం,బాల సభ , 15 వ తేదీన విలీన విద్యా దినోత్సవం , బాలిక విద్యా దినోత్సవం నిర్వహిస్తామన్నారు. 18 వ తేదీన తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కలిగించాలన్నారు. 19వ తేదీన అన్ని తరగతుల విద్యార్థులకు వివిధ క్రీడలను నిర్వహిస్తూ క్రీడా దినోత్సవం జరపాలని ఆయన తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారిని ప్రయోజకులు చేయగలరని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు సంబంధించి పాఠశాలలో చేపడుతున్న మౌలిక సదుపాయాల కల్పన కి సంబంధించిన పనులు పాఠశాలలు పున: ప్రారంభానికి ముందే పూర్తి చేయడానికి ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు.అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వార చేపడుతున్న నిర్మాణ పనుల తీరును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అదికారి ప్రణిత, డిప్యూటీ ఈఈ శివరాం, డీపీఎం డీఆర్డీఏ గంగన్న, ఎంఆర్ ఓ లక్ష్మి, ఎంపీడీఓ , మోహన్ రెడ్డి, మండల నోడల్ అధికారి రాజశంకర్, స్థానిక పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, అంగన్వాడి సిబ్బంది, అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు, తదితరులు పాల్గొన్నారు.