సిరాన్యూస్, ఇంద్రవెల్లి
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి : కలెక్టర్ రాజర్షి షా
* తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఇంద్రవెల్లిలో జయశంకర్ బడిబాట కార్యక్రమం
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ 2 ఎస్సి కాలనీ గల పాఠశాలలో ప్రో. జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి, వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని మాట్లాడారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తుందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యా బోధనను అందిస్తున్నమన్నారు. విద్య వ్యవస్థను మెరుగుపరచడానికి సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని త్వరలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తుందన్నారు. పాఠశాలలో నీటి, మరుగుదొడ్ల, ప్రహరీ గోడ, అదనపు గదుల నిర్మాణ పనులను ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు. ప్రవేట్ పాఠశాలలో వేలకు వేలు డబ్బులు పెట్టి తల్లి తండ్రులు మోసపోవద్దన్నారు. సర్కారు బడుల్లో చదువుకోవాలన్నారు. పిల్లలు సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు కార్యాలయాలను పర్యవేక్షణ చేస్తూ ఉండాలని సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.