సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రతి వార్డులలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలి: కలెక్టర్ రాజర్షి షా
* విద్యార్ధుల భవిష్యత్ ను తీర్చిదిద్దడం లో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
* మంచి వాతావరణంలో పిల్లలకు విద్యా బోధనా అందించాలి
* మధ్యాహ్నం భోజనం నాణ్యతతో కూడిన ఆహారం పెట్టాలి
ప్రతి వార్డులలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపాలిటీ పరిధి లోని బంగారి గూడ కాలనీ, మండల ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం , రామాయి మండల ప్రాథమిక పాఠశాలలను జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మొదటగా ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డే లో భాగంగా బంగారి గూడ కాలనీ లో పర్యటించి కాలనీ సమస్యల పై ఆరాతీశారు.ఇంటింటికి వెళ్లి పరిసరాలను దగ్గరుండి పరిశీలించారు. వర్షాకాలం సందర్భంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, చుట్టు ప్రక్కల, రోడ్ల పైన, ఇళ్లల్లో ఉండే కూలర్లు, రంజాన్ లు, కొబ్బరి బోండాలు , తదితర వాటిలో నీరు నిలువ లేకుండా పరిశుభ్రత పాటించాలని పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని, ఈ సీజన్ లో దోమలు, ఈగలు వాలకుండా శుభ్రత పాటించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.కాలనీ లో ఉన్న సమస్యలను విని సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని అన్నారు.అనంతరం బంగారి గూడ ఉర్దూ మండల ప్రాథమిక పాఠశాల ను సందర్శించి విద్యార్ధుల అభ్యాస సామర్థ్యాలను పరిశిలించి, విద్యార్ధులతో పాఠాలు చదివించి, బోర్డ్ పై వ్రాయించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు యూసఫ్ ఖాన్ ను ఉర్దూ తో పాటు ఇంగ్లీష్ కూడా నేర్పించాలని, విద్యార్ధుల పై ప్రత్యేక దృష్టి సారించి, వారి నైపుణ్యాన్ని వెలికి తీయాలని, వారి భవిష్యత్తు ను తీర్చిదిద్దడం లో బాధ్యతగా వ్యవహరించాలని, బోధన సరిగా లేదని, చదవడం వ్రాయడం లో శ్రద్ద వహించాలని తెలిపారు. తదుపరి రామాయి మండల ప్రాథమిక పాఠశాల ను సందర్శించి మధ్యాహ్నం భోజనం ను పరిశీలించి నాణ్యతతో కూడిన ఆహారం అందించాలనీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా వినియోగించాలని, కిచెన్ షెడ్ ఏర్పాటు చేయాలని పరిసరాలు బాగుండి, సరైన విద్యా బోధనా ఉంటేనే పిల్లలు బాగా చదువుతారని అన్నారు. ప్రాథమిక పాఠశాల నుండి పిల్లలకు వారి భాష తో పాటు ఇంగ్లీష్ లో రాయడం, చదవడం నేర్పించాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనలో భాగంగా పాఠశాల లో చేపట్టిన పనులను పరిశీలించారు.తరగతి గదులు , టాయిలెట్స్, రన్నింగ్ వాటర్ పరిశీలించి స్కూల్ బిల్డింగ్ పై బాగం లో నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలని, తరగతి గదులలో వర్షం నీరు పడకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ఖమ్మర్ హైదర్, మండల విద్యాధికారి , తహసిల్దార్, పాఠశాలల ప్రదానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.