Rajendra Vijay: పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలి: ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్

సిరాన్యూస్, ఆదిలాబాద్
పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలి: ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్

పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే మైక్రో అబ్జర్వర్స్ శిక్షణ కార్యక్రమాన్ని బుధ‌వారం ఆదిలాబాద్ జిల్లా జ‌డ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా పాల్గొని పలు సూచనలు సలహాలు చేశారు.ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల రోజు పోలింగ్ ప్రక్రియ సజావుగా , సునిశితంగా పరిశీలించడానికి మైక్రో అబ్సర్వర్లను నియమించడం జరిగిందని తెలిపారు. మాక్ పోల్ నిర్వహణ, పోలింగ్ కేంద్రాల దారులు, మాక్ పోల్ తదనంతరం చేపట్టే పోలింగ్ ప్రక్రియ నిబంధనల కనుగుణంగా, పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అన్నది నిశిత పరిశీలన చేయాలని తెలిపారు. ఈ అంశాల పై జనరల్ అబ్జర్వర్ దృష్టి కి తీసుకెళ్లాలని, పోలింగ్ కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు, సీక్రెట్ పోలింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాట్లు, ప్రతీది పరిశీలించాలని, ఎక్కడైనా సాంకేతిక లోపాల వల్ల ఈవీఎంలు పనిచేయక పోతే వాటి స్థానంలో వేరే ఈవీఎంలుఎలా అమరుస్తున్నారో పరిశీలన చేయాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణం లో పోలింగ్ జరిగేలా చూడాలని, మైక్రో అబ్జర్వర్స్ ఈ శిక్షణ లో అన్ని అంశాల పై అవగాహన కల్పించుకొని పోలింగ్ ప్రక్రియ ను విజయవంతం చేయాలని కోరారు. అలాగే పోలింగ్ కు సంబంధించిన నివేదికలను సకాలంలో ఎప్పటికప్పుడు పంపాలని తెలిపారు. మాక్ పోల్ ఉదయం 5.30 కు ఎజెంట్ల సమక్షంలో నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర అధికారులు నిర్వహిస్తున్న విధులు, టెండర్, ఛాలెంజ్ ఓటింగులు జరిగితే వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ బుదవారం నిర్వహించిన మైక్రో అబ్జర్వర్స్ శిక్షణ కార్యక్రమం లో అదిలాబాద్ పార్లమెంటు పరిధి లోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన 190 మంది మైక్రో అబ్జర్వర్ల కు అవగాహన కల్పించడం జరుగుతుందని , పారదర్శకంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నడిచేలా మైక్రో అబ్జర్వర్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలని, అనెగ్జర్ -28 ప్రకారం 18 అంశాలకు చెందిన వాటిపై ఎప్పటికప్పుడు నివేదికలు జనరల్ అబ్జర్వర్ కు నేరుగా పంపాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని, పోలింగ్ రోజు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన విధి విధానాలు అమలు అవుతున్నాయా లేదా పరిశీలించాలని, మాక్ పోల్, ఈవీఎం యంత్రాల సీల్, అభ్యర్థికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ల వివరాలు, 17-ఏ రిజిస్టర్ నిర్వహణ, పోల్ పూర్తి అయ్యేంత వరకు జరిగే ప్రక్రియపై నివేదికలు ఇవ్వాలని, ఎన్నికల నిర్వహణలో ఏమైన సమస్యలు తలెత్తితే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ ఎలా సాగుతున్నది గమనించడమే మైక్రో అబ్జర్వర్స్ పాత్ర అని ఈ శిక్షణను శ్రద్ధగా విని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని అన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్ లక్ష్మన్ మైక్రో అబ్జర్వర్స్ కు అవగాహన కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *