ఆ ముగ్గురికి రాజ్యసభ

 సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికలపై దృష్టిసారించారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేసేందుకు వైసీపీ అధినేత జగన్ కసరత్తు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం నాటికి ముగ్గురు అభ్యర్థుల పేర్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ముగ్గురి పేర్లను కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేవారిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్‌రెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు అభ్యర్థుల పేర్లను సాయంత్రం నాటికి వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో 8న ఎమ్మెల్యేలతో మాక్‌ పోలింగ్‌ నిర్వహించేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది.ప్రస్తుతం వైసీపీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం 3 స్థానాలూ గెలుచుకునే అవకాశం ఉంది. అయితే, తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని బరిలో నిలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీ పోటీ చేయాలని భావిస్తోంది. వైసీపీలో టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న MLAలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారనే అంచనాతో TDP తమ అభ్యర్థిని బరిలో నిలుపుతోంది. మొత్తంగా టీడీపీ క్రాస్‌ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకుంది.ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 3 రాజ్యసభ స్థానాల్లో ఒక్కో సీటుకు 44మంది ఎమ్మెల్యేల ఓట్లు తప్పనిసరి. 3 స్థానాలు గెలవాలంటే 132మంది అవసరం. YCPకి ఇంతకు మించే బలం ఉన్నా.. దాదాపు 25 మంది టికెట్ దక్కని వారు ఉన్నారు. కావున వాళ్లలో ఎవరైనా క్రాస్‌ ఓటింగ్‌ చేస్తారా అనే సందేహం ఉంది. అటు, స్పీకర్‌ ఇప్పటికే పార్టీ ఫిరాయించిన 9 మందికి నోటీసులు ఇచ్చారు. గంటా రాజీనామా ఆమోదించారు. TDP, జనసేన, YCP ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఒక్కో MPకి కావాల్సిన MLAల సంఖ్యాబలం మారే అవకాశం ఉంది.కాగా.. ఏప్రిల్ 3వ తేదీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్, సీఎం రమేష్ రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. ఈ స్థానాలకే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి.. ఈనెల 8వ తేదీన రాజ్యసభ నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15 వరకూ గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27 పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ పూర్తి కాగానే కౌంటింగ్‌ చేసి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
గురువారం మాక్ పోలింగ్
గురువారం అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నందున రాజ్యసభ స్థానాలకు సంబంధించి తుది నిర్ణయం అవకాశం కనిపిస్తోంది. అధికారికంగా అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ఈ నెల 8న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రాబోతోంది. అదే రోజున మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ కూడా జరగబోతోంది. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిని పెట్టే ఆలోచనలో ఉంది. ఎలాంటి పొరపాట్లు జరక్కుండా అంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు, అదే విధంగా అప్పుడు జరిగిన విధంగానే క్రాస్ ఓటింగ్ జరగకుండా ముందస్తుగానే వైసీపీ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగానే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. దానికి సంబంధించి రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. విచారణకు పిలిచారు. 8వ తేదీన మరోసారి రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలవబోతున్నారు. ప్రత్యక్షంగా తమ వివరణ ఇవ్వబోతున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనర్హతా వేటు వేస్తే ఈసీ అంగీకరిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. టిక్కెట్లు దక్కని పలువురు ఎమ్మెల్యేలు .. టీడీపీ నిలబెట్టే అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎక్కువ మంది రిజర్వుడు నియోజకవర్గాల వారికి టిక్కెట్లు మారుస్తున్నారు. ఈ కారణంగా టీడీపీ దళిత అభ్యర్థిని పోటీకి పెడితే వారంతా దళిత ఎమ్మెల్యేలంతా టీడీపీ అభ్యర్థికి ఓటేస్తారన్న అంచనాలు ఉన్నాయి. అందుకే దళిత నేత గొల్ల బాబూరావుకు టిక్కెట్ ఖరారు చేసి.. ఓటింగ్ లో దళిత ఎమ్మెల్యేలను ఆయనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *