రామచంద్రపురం టిక్కెట్ సుబ్రహ్మణ్యంకే ఇవ్వాలి

టిడిపి శెట్టిబలిజ నాయకులు, కార్యకర్తల డిమాండ్
సిరా న్యూస్,కొత్తపేట…
టిడిపి అసెంబ్లీ టిక్కెట్లలో శెట్టిబలిజలకు సముచిత స్థానం కల్పించాలని టిడిపి శెట్టిబలిజ సామాజిక వర్గ నాయకులు డిమాండ్ చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో టిడిపి శెట్టిబలిజ వర్గీయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రాష్ట్ర టీడీపీ శెట్టిబలిజ కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కుడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ ఇటీవల టిడిపి జనసేన ప్రకటించిన సీట్లలో కనీసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా శెట్టిబలిజలకు కేటాయించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే నిలిచిన శెట్టిబలిజలకు తగిన ప్రాధాన్యత కల్పించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. వైసీపీలో ఇప్పటివరకు ప్రకటించిన సీట్లలో మూడు అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లను శెట్టిబలిజలకు కేటాయించారన్నారు.ఆ పార్టీకి ధీటుగా కాకపోయినా కనీసం రెండు అసెంబ్లీ సీట్లను ఒక ఎంపీ స్థానం అయినా శెట్టిబలిజలకు కేటాయిస్తే తమ సామాజిక వర్గీయుల్లో ఓట్లను అడిగేందుకు వీలుంటుందనీ అన్నారు. ఇప్పటికైనా టిడిపి, జనసేన అధినాయకులు స్పందించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న శెట్టిబలిజలకు కనీసం రెండు అసెంబ్లీ సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. రెండు అసెంబ్లీ సీట్లను తమ వర్గీయులకు ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించి తమ సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు. అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో టిక్కెట్ ను రెడ్డి సుబ్రహ్మణ్యం కు కేటాయించాలని కోరారు. రామచంద్రపురం నియోజకవర్గం లో పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు రెడ్డి సుబ్రహ్మణ్యం పార్టీ నీ తన భుజాలపై వేసుకుని పార్టీని ముందుకు నడిపించారన్నారు. అలాంటి వ్యక్తికి ఇప్పటివరకు సీటు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *