సిరా న్యూస్,హైదరాబాద్;
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్) వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారికి విజయవంతంగా కాలేయ మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మోదుగు చోహన్ ఆదిత్య (3) అనే చిన్నారికి పుట్టుకతో వచ్చే బిలియరీ అట్రేసియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి ఉన్న వారిలో కాలేయ వైఫల్యం జరుగుతుంది. ఆదిత్యకు కూడా కాలేయ మార్పిడి చేయవల్సి వచ్చింది.
అధునాతన కాలేయ దాత మార్పిడి ప్రక్రియ ద్వారా ఉస్మానియా వైద్యుడు డాక్టర్ మధుసూదన్, అతని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ల బృందం చిన్నారికి కాలేయ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. చిన్నారికి అతని తల్లి కాలేయం దానం చేసింది. తల్లి కాలేయంలో కొంత భాగాన్ని తీసి చిన్నారికి మార్పిడి చేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. వీరు జూలై 16న డిశ్చార్జ్ అయినట్లు ఉస్మానియా వైద్యులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.కాగా ఉస్మానియా ఆస్పత్రిలో ఇప్పటివరకు ఎనిమిది పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కేసులతో సహా మొత్తం 30 కాలేయ మార్పిడి ఆపరేషన్లు ఉస్మానియా ఆస్పత్రిలో విజయవంతంగా నిర్వహించాచరు. పుట్టుకతో వచ్చే బిలియరీ అట్రేసియా, NISCH సిండ్రోమ్, విల్సన్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఇక్కడ విజయవంతంగా శస్త్ర చికిత్స అందించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు కాలేయ మార్పిడి వంటి ఖరీదైన ఆరోగ్య సేవలను కూడా అందిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సేవలను సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.1910లో స్థాపించబడిన ఉస్మానియా ఆసుపత్రి.. తెలంగాణలోని అతి పురాతనమైన, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఒకటి.