ఆ రెండింటికి రేషన్ కార్డే…

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో ఒకటైన 200 ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధంచి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు కూడా ఉచిత విద్యుత్ అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన బృందం శనివారం బెంగళూరు వెళ్లింది. బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ లిమిటెడ్ కార్యాలయాన్ని సందర్శించింది. గృహ జ్యోతి పథకం అమలును అర్థం చేసుకోవడానికి తెలంగాణ అధికారులు బెస్కామ్ కార్యాలయాన్ని సందర్శించారు.తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి ముషారఫ్ ఫరూఖీ నేతృత్వంలో బృందం కర్ణాటకకు వెళ్లింది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే విధమైన ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడానికి గృహ జ్యోతి పథకం గురించి ఇన్‌పుట్‌లు తీసుకోవడానికి బెంగళూరు వెళ్లారు. వారు బెస్కామ్ ఎండి మహతేష్ బిలాగి, డైరెక్టర్ ఫైనాన్స్ ధర్‌షన్ జె, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రెవెన్యూ సెక్షన్ అధికారులతో చర్చలు జరిపారు.గృహ జ్యోతి పథకం కింద, కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నివాస గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది.2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఒకటి. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.13,910 కోట్లు భారం పడే అవకాశం ఉంది. అయితే ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందేందుకు ఎవరు అర్హులని సందేహాలు వస్తున్నాయి.రేషన్ కార్డు ఉన్నవారికే ఈ ఉచిత విద్యుత్ పథకానికి అర్హులుగా ప్రకటించారు. అయితే కిరాయి ఉండేవారికి ఎలా ఉచిత విద్యుత్ అందిస్తారానేది ప్రశ్నగా మారింది. ఈ ఉచిత విద్యుత్ పాటు త్వరలో రూ.500 గ్యాస్ సిలిండర్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *