నిజంగా… నియోజకవర్గ అభివృద్ధి కోసమేనా ?

కేటీఆర్ వ్యూహం ఏమిటీ
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో కాంగ్రెస్ కొలువు తీరి దాదాపు రెండు నెలలు కావస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కోసం మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. సీఎంగా రెండు నెలలు పూర్తి చేసుకోనున్న రేవంత్ రెడ్డి మళ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సారధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలతో సమావేశమై సమీక్షలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి క్యాడర్ ను బయటకు తెచ్చి, వారిలో స్ఫూర్తి నింపే బాధ్యతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావులు భుజాన ఎత్తుకున్నారు.త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటన ఉంటుందని గులాబీ నేతలు చెబుతున్నారు. ఈ తరుణంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి( దుబ్బాక), సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్) మాణిక్ రావు (జహీరాబాద్), గూడెం మహిపాల్ రెడ్డి( పఠాన్ చెరు) కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలం సృష్టించింది. ఈ నలుగురు కలిసిన తర్వాత తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్) సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చాంశనీయంగా మారింది.ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిసినప్పుడు చెప్పిన కారణం ఏంటంటే తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కలిశామన్నారు. అంతే కాకుండా జిల్లాలో ప్రోటోకాల్ అమలు, సెక్యూరిటీ పెంపు వంటి అంశాలు చర్చించామని, అంతే తప్ప బయట ప్రచారంలో ఉన్నట్లు తాము కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని వివరణ ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిస్తామంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకంపనలు ముగియకమునుపే.. తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సైతం రేవంత్ రెడ్డిని కలవడం అసలేం జరుగుతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రకాష్ గౌడ్ సైతం ఆ నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలిసినప్పుడు ఏం చెప్పారో అదే చెప్పడం గమనార్హం. తాను కూడా తన నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని చెప్పడం విశేషం. తాను పార్టీ మారడం లేదని మీడియాకు వివరణ ఇచ్చారు.
ఆ నలుగురు గులాబీ బాస్ కు చెప్పే కలిశారా ?
అయితే ఉమ్మడి మెదక్ జిల్లా నుండి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ అనుమతితోనే కలిశారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లా.. మాజీ సీఎం, అంతే కాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వంత జిల్లా. అదే జిల్లా నుండి బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు ఉన్నారు. ఆ జిల్లా నుండి నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం గులాబీ పార్టీలో కలకలం రేపింది. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుల అనుమతితోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారా… లేదా ఇది వారి స్వంత నిర్ణయమా అన్న విషయం సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కారణం ఏదైనా.. పార్టీ అధినేత కేసీఆర్ కు సమాచారం ఇచ్చి కలిసారా లేదా అన్నదే ఇప్పుడు అందరిలోను ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
తాజాగా రంగారెడ్డి జిల్లా నుండి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ సైతం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం హాట్ టాపిక్ గామారింది. ప్రకాశ్ గౌడ్ సైతం నలుగు ఎమ్మెల్యేలు చెప్పిన కారణమే రేవంత్ రెడ్డిని కలసిన తర్వాత చెప్పడం విశేషం. నియోజకవర్గ అభివృద్ధి తప్ప తాను పార్టీ మారడం లేదని, ఇందులో రాజకీయ కోణమేది లేదని వివరణ ఇచ్చారు. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి పదవి చేపట్టి రెండు నెలలు కాకముందే నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కలవడం మాత్రం అందరిలోను ఉత్కంఠకు తెర లేపింది. ఇప్పటికిప్పుడు అభివృద్ధి పనులు ఏంటా… అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మెదక్ జిల్లా విషయానికి వస్తే గతంలో సీఎంగా కేసీఆర్ తొమ్మిదన్నరేళ్లుగా ఉన్నారు. మంత్రి హరీశ్ రావు కూడా దాదాపు 9 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, గూడెం మహిపాల్ రెడ్డి, అటు కేసీఆర్ తోను, హరీశ్ రావుతోను సాన్నిత్యం ఉన్నవారే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *