సిరా న్యూస్, డిజిటల్:
ఆదిలాబాద్లో రెడ్డి రాజ్యం…!?
+ ఆ దిశగా అడుగులు వేస్తున్న కంది అండ్ టీం
+ జోగు ఓటమి తరువాత జోష్లో
+ వచ్చేది రెడ్డి రాజ్యమేనని ధీమా
+ ఏకమౌతున్న రెడ్డి లీడర్లు
+ పలువురి చేరికలతో ‘రెడ్డి రాజ్యం’ వాదానికి బలం
చిల్కూరి రాంచంద్రా రెడ్డి మొదటి సారిగా 1978లో స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆదిలాబాద్ నియోజక వర్గంలో రెడ్డి రాజ్య స్థాపన చేపట్టారు. అంతకు ముందు మసూద్ హైమద్, కస్తాల రాంకిష్టు, విఠల్రావ్ దేశ్పాండే, దాజీ శంకర్లు ఎమ్మెల్యేలుగా కొనసాగారు. వీళ్ల తరువాత రెడ్డి సామాజిక వర్గం నుండి రాంచంద్రా రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆదిలాబాద్ పూర్తిగా రెడ్డి గుప్పిట్లో వెళ్లిపోయింది. 1978 నుంచి 2004 వరకు కూడ ఆదిలాబాద్ రెడ్డి సామాజిక వర్గం హవా కొనసాగింది. మధ్యలో 1999లో పడాల భూమన్న ఎమ్మెల్యేగా గెలిచి, రెడ్డి ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసినప్పటికీ, ఆయన తరువాతీ రోజుల్లో అంతగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఎమ్మెల్యే పదవి రెడ్డి సామాజిక వర్గానికి సొంతమైంది.
జోగు రామన్న రాకతో తారుమారు…
1999 ప్రాంతంలో ఆదిలాబాద్లో మున్నూర్కాపు సామాజిక వర్గంలో సామాజిక సృహ పెర్గడంతో, ఆదిలాబాద్లో తమ జనాభా ఎక్కువగా ఉన్నందున తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కులసంఘాలు నిర్ణయించుకున్నాయి. అప్పట్లో పడాల భూమన్న ఇండిపెండెంట్గా పోటీ చేయగా, గ్రామాల వారీగా మున్నూర్కాపు నాయకులు ప్రతీ ఇంటి నుంచి పత్తి పంట విరాళంగా అందించి, పడాల భూమన్నను ఎమ్మెల్యేగా గెలిపించిన విషయం అందరికి తెలిసిందే. పడాల భూమన్న తరువాత 2004 మొదటి సారి జోగు రామన్నను ఎమ్మెల్యేగా గెలిపించి, మున్నూర్కాపులు తమ ఐక్యతను చాటారు. 2004 నుండి వరుసగా 2023 వరకు జోగు రామన్న తిరుగులేని నాయకునిగా కొనసాగారు. ఆదిలాబాద్ మున్నూర్కాపు సామాజిక వర్గంలో మెజార్టీ ఆయనవైపే ఉండటంతో 14 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఎమ్మెల్యేగా సేవలందించారు.
2018 తరువాత మారిన సమీకరణాలు…
2018లో జోగు రామన్న గెలుపు తరువాత అదిలాబాద్లో రెడ్డి సామాజిక వర్గం మరో సారి జాగృతమైంది. ఎలాగైన ఆదిలాబాద్లో మరోసారి రెడ్డి నాయకున్ని ఎమ్మెల్యేగా గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. అటు తరువాత ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస రెడ్డి ఎంట్రీతో ఆదిలాబాద్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. తొలుత బీజేపీలో చేరినప్పటికీ, అటు తరువాత కాంగ్రేస్ తీర్థం పుచ్చుకున్న ఆయన 2023లో ఎమ్మెల్యేగా పోటీసీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ కూడ దాదాపుఉ 50వేల ఓట్లు సాధించి, విమర్శకుల నోళ్లు మూయించడంతో పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని ఒక్కతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అ«ధ్వర్యంలో కాంగ్రేస్ పార్టి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు మరల ఏకమౌతున్నారు. వివిద పార్టీల్లో ఉన్నవారంత కాంగ్రేస్ గూటికి చేరి, కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వాన్ని బలపర్చేందుకు సిద్ధమౌతున్నారు.
కీలక నేతలు జంప్…
తెలంగాణ ఉద్యమకారుడైన బాలూరి గోవర్ధన్ రెడ్డి ఏళ్లుగా బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. అయితే పార్టీలో తనకు తగిన స్థానం లేకపోవడం, డీసీసీబీ చైర్మన్ పోస్ట్ ఆశించి భంగపడటంతో జోగు రామన్నతో ఆయన సైద్ధాంతిక విభేదాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయన 2023 ఎన్నికలకు ముందే బీఆర్ఎస్కు రాజీనామ చేసి, కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రేస్లో చేరారు. ఎన్నికల తరువాత జోగు రామన్నకు అప్తుడు, నమ్మిన బంటు అయిన అడ్డి భోజారెడ్డి సైతం బీఆర్ఎస్కు రాజీనామ చేసి కాంగ్రేస్లో చేరడం జరిగింది. డీసీసీబీ చైర్మన్గా కొనసాగుతున్న ఆయన బీఆర్ఎస్కు రాజీనామ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా జోగు రామన్న స్వంత మండలమైన జైనథ్ నుండి తుమ్మల వెంకట్ రెడ్డి సైతం పార్టీని వీడి తన సతీమణి, జైనథ్ జడ్పిటీసీ తుమ్మల అరుంధతి రెడ్డితో సహా కాంగ్రేస్ కండువా కప్పుకున్నారు. జోగు రామన్న రాజకీయ ప్రయాణంలో ఎంతో కీలక పాత్ర పోషించిన తుమ్మల వెంకట్ రెడ్డి సైతం పార్టీని వీడటం హాట్టాపిక్గా మారింది. టీడీపీలో ఉన్నప్పుడు కూడ పార్టీ మండల అధ్యక్ష బాధ్యతలు చేపట్టి తుమ్మల, బీఆర్ఎస్లో సైతం పార్టీ మండల అధ్యక్షునిగా బాద్యతలు చేపట్టి, పార్టీని క్రమశిక్షణగా నడిపించడంలో విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన సైతం కాంగ్రేస్ తీర్థం పుచ్చుకోవడంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లీడర్లంత ఒక్కొక్కరుగా కంది శ్రీనివాస రెడ్డి సరసన చేరడం ఖాయమనీ, ఇదే బాటలో మరింత మంది రెడ్డి లీడర్లు నడవడం ఖాయమని తెలుస్తోంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రేస్లో జంప్ అయిన రెడ్డి లీడర్లు బయటకు చెప్పేది ఏమైనప్పటికీ కూడ, అందరి లక్ష్యం ఆదిలాబాద్లో రెడ్డి సామాజికి వర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యేను చేయడమేనని జనాలు చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జోగు రామన్న ఓడి పోయి, పాయల్ శంకర్ గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన పాయల్ శంకర్, తాను ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తానని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రేస్ అధికారంలో ఉండగా, బీజేపీకి చెందిన పాయల్ శంకర్ ఆదిలాబాద్ అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కాంగ్రేస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఫుల్ జోష్లో ఉన్న కంది అండ్ టీం, 2028లో మాత్రం అధికారం తమదేనని «ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెడ్డిలు స్వతహాగా పాలన దక్షత కలిగి ఉంటారని, రానున్న రోజుల్లో ఆదిలాబాద్ ప్రజలు రెడ్డి రాజ్యాన్ని స్వాగతించడం తథ్యమని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.