సిరా న్యూస్, చిగురుమామిడి:
బొమ్మనపల్లిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మండలంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, అంబేద్కర్ సంఘం, గౌడ సంఘం, రైతు వేదిక, మహిళ సంఘం, పురుషుల పొదుపు సంఘం, కరీంనగర్ పాల డైరీ, ముల్కనూరు పాల డైరీ, విస్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, తాపీ కార్మిక సంఘం, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… రాజ్యాంగం అమలులోకి రావడంతోనే దేశంలోని బడుగు, బలహీన, నిమ్న వర్గాల ప్రజలకు నిజమైన స్వాతంత్రం లభించిందని అన్నారు. దేశం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.