సిరా న్యూస్,ఒంగోలు;
లోకల్ నాయకుడు ముద్దు.. నాన్ లోకల్ వద్దు అంటూ ప్రకాశంజిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇస్తే లోకల్గా పార్టీకోసం పనిచేస్తున్న తమకే ఇవ్వాలంటూ స్థానిక వైసీపీ నేతలు అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాకాదని ఇతర నియోజకవర్గం నుంచి నాయకుడిని బదిలీ చేస్తే తాము ఆ అభ్యర్ధి కోసం పనిచేయమని కరాఖండిగా తేల్చి చెప్పేశారు. గిద్దలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇప్పటికే తాను ఈసారి పోటీ చేయనని ప్రకటించడంతో ఎప్పటి నుంచో టికెట్పై ఆశలు పెంచుకున్న ఆశావహుల ఆశలకు రెక్కలు వచ్చాయి. ఈసారి టికెట్ మాదేనన్న భరోసాలో ఉంటే హఠాత్తుగా మార్కాపురం నుంచి అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డికి గిద్దలూరు టికెట్ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో గిద్దలూరు నేతలు మండిపడుతున్నారు.మరోవైపు మార్కాపురంలోనే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి కూడా గిద్దలూరు నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. తనకు మార్కాపురం టికెట్ తిరిగి కేటాయిస్తే గెలిచి చూపిస్తానని ఇప్పటికే అధిష్టానం పెద్దలకు ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి వివరించారు. ఈ పరిస్థితుల్లో బలవంతంగా బయటి నాయకులను గిద్దలూరుకు పంపించవద్దంటూ స్థానిక నేతలు మొరపెట్టుకుంటున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారపేటలో స్థానిక నేతలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి గిద్దలూరు వైసీపీ టికెట్ ఆశిస్తున్న కామూరి రమణారెడ్డి, చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, గిద్దలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రామకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో 12 మంది ఎంపీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, ఓ జడ్పిటీసీ, 30 మంది సర్పంచ్లు ఉన్నారు.గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. దీంతో స్థానికంగా టికెట్ ఆశిస్తున్నవారంతా బాలినేని అయితే ఒకే అన్నారు. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా బాలినేని ఒంగోలు నుంచే పోటీలో ఉండటంతో గిద్దలూరులో కొత్తవ్యక్తికి టికెట్ కేటాయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దంటూ గిద్దలూరులో నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గిద్దలూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మార్కాపురంకు చెందిన అన్నా రాంబాబును తీసుకొచ్చి పెట్టారని, ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమను పట్టించుకోకుండా పార్టీకి నష్టం చేశారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా బయట వ్యక్తులకు టికెట్ ఇస్తే పరిస్థితి ఇంకా దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని స్థానికులకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని సీఎం జగన్కు విజ్ఞప్తి చేస్తున్నారు. గిద్దలూరు నుంచి పోటీలో తమలో ఎవరికి ఇచ్చినా అంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెబుతున్నారు. మరి అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో వేచిచూడాలి