సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టిన రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా ప్రముఖ నేత అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆయనతో ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకునేందుకు షెడ్యూల్ ఖరారు చేస్తోంది. తాజాగా రెండు రోజుల పాటు కేరళలో ప్రచారం చేసేందుకు వెళ్తున్నారు. అక్కడి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారం చేయనున్నారు. సీఎం రేవంత్రెడ్డికి దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. ప్రత్యర్థులపై కౌంటర్లు, తనదైన శైలిలో సెటైర్లు ఇస్తున్న తీరు ఇతర రాష్ట్రాల ప్రజలనూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే తర్వాత రేవంత్ను కూడా ప్రచారానికి రావాలని సుమారు ఏడు రాష్ట్రాల పీసీసీలు, పలువురు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్లు ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళలో కాంగ్రెస్ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో క్యాంపెయినింగ్కు రేవంతే రావాలని పట్టుబడ్తున్నారు. కనీసం ఒక్క బహిరంగ సభలోనైనా పాల్గొనాలని కోరుతున్నారు. అప్పుడే తమ గెలుపు ఈజీ అనే ఆలోచనలో అభ్యర్థులున్నారు. దీంతో వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో 50 సభలు,15 రోడ్ షోలకు సీఎం రేవంత్ సిద్ధమయ్యారు.. ఈ నెల 19వ తేదీన మహబూబ్ నగర్, మహబూబాద్ లో జరిగే బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తెలంగాణలో నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ప్రచారంతో పాటు తమిళనాడుతో పాటు మొదటి మూడుదశల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నతర్వాత రేవంత్ రెడ్డికి పొరుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఇమేజ్ పెరిగిపోయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే రేవంత్ కు తెలుగువారిలో మంచి ఆదరణ ఉన్నందున.. కర్ణాటకలో ప్రాచరం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ రేవంత్ ప్రచారం చేయనున్నారు. ఇక ఏపీలో రేవంత్ రెడ్డి తెర వెనుక అయినా కీలకంగా వ్యవహిరంచి షర్మిలకు మద్దతుగా నిలవాల్సి ఉంది. ఇప్పటికే వైజాగ్ లో నిర్వహించిన బహిరంగసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కర్ణాటకలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగియగానే.. అక్కడి నేతలతో కలిసి ఏపీకి సీఎం రేవంత్ వస్తారని అంటున్నారు. నాలుగైదు సభలకు ఆయన హాజరుకావచ్చన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో ప్రముఖ నేతగా మారారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తెలుగువారు ఎక్కువగా ఉన్న చోట రేవంత్ రెడ్డితో ప్రచారం చేయించుకునే అవకాశం ఉంది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ స్థాయి అంతకంతకూ పెరుగుతున్న పరిణామాన్ని సూచిస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితునిగా పేరు పడిన రేవంత్ రెడ్డి.. లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి పదికిపైగా సీట్లు సాధించి పెడితే.. ఆయన పలుకుబడి హైకమాండ్ వద్ద మరింత గా పెరుగుతుంది. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల ప్రచార ర్యాలీలు, సభల్లో పాల్గొనేందుకు రావాలని సీఎం రేవంత్కు ఇప్పటికే ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ పీసీసీల నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది. తాజాగా, తమిళనాడుతోపాటు గుజరాత్, బిహార్ పీసీసీల చీఫ్ల నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చినట్టు సీఎంవో ధ్రువీకరించింది. ఆయా రాష్ట్రాల పీసీసీలతో పాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులు కూడా ప్రచారానికి రావాలని రేవంత్ను రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలిసింది.