సిరా న్యూస్, ఇచ్చోడ
అసాంఘిక కార్యకలాపాలకు నిలయం.. ప్రయాణ ప్రాంగణం
* తాత్కాలిక బస్టాండ్ వద్ద కనీస వసతులు కరువు
* ఇబ్బందుల్లో ప్రయాణికులు … పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
రాత్రయితే చాలు అక్కడ మందుబాబులు చిందులేస్తారు. ఇక ఇతర అసాంఘిక కార్యకలా పాలకు అడ్డూ అదుపూలేదు. శిథిలంలో ఉన్న ఏం జరుగుతోందో పట్టించుకునే వారే లేరు.. మండల కేంద్రంలో ఇలా జరుగుతుండడం గమనార్హం. ఇచ్చోడ మండల కేంద్రంలో గతంలో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో మండల కేంద్రానికి చెందిన ఓ దాత రెండు ఎకరాల స్థలాన్ని ఆర్టీసీ అధికారులకు విరాళంగా ఇచ్చారు. దీంతో 1987లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల నిధులతో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించారు. అయితే ఇప్పుడు ఆ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం శిథిలావస్థకు చేరుకుంది. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఇప్పటికీ అక్కడ బస్సులను నిలుపుతుండడంతో ప్రయాణికులు ఎవ్వరు అక్కడికి వెళ్లడం లేదు. మండల కేంద్రానికి దూరంగా ఉండటంతో ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం మండల కేంద్రంలో తాత్కాలిక ప్రయాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయగా కనీస వసతులు కరువయ్యాయి. కనీసం కూర్చోవడానికి బల్లలు లేకపోవడంతో ఎండలో ఎండూతూ… వానలో తడుస్తూన్నామని ప్రయాణికులు వాపోతున్నారు. మండల కేంద్రమైన ఇచ్చోడకి వివిధ గ్రామాల నుంచి వివిధ పనుల కోసం ప్రజలు, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు ప్రతి రోజు వస్తూ పోతుంటారు. అలాగే ఈ తాత్కాలిక ప్రయాణ ప్రాంగణం నుంచి హైదరాబాదు, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, నాగపూర్ వైపు నిత్యం ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళుతుంటారు. వారికి నిల్చోవడానికి ప్రయాణ ప్రాంగణం లేక హోటళ్లు కిరాణషాపులు, డబ్బాలు, జూస్ సెంటర్లను వెతుక్కొని వేచి ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రయాణాకులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.