హోరాహోరికి రెండు పార్టీలు
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చి మూణ్నాళ్లు కాలేదు అప్పుడే లడాయి షురూ అయింది. ముందటి ప్రభుత్వపు ట్రేడ్ మార్కు పనులను టార్గెట్ చేసి మరీ కొడుతున్నారు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోటి ఎకరాలమాగాణం ఘనకీర్తి, కేసీఆర్ భుజకీర్తి కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ఫోకస్ పెట్టారు. కృష్ణాబోర్డు విషయంలో కొత్త ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టడానికి కేసీఆర్ కొత్త ఉద్యమం ఎత్తుకుంటే… పాత ప్రాజెక్టులో బొక్కలు బయటకు తీసి..లెక్కలు తేలుస్తానంటూ రేవంత్ రెడ్డి బయలుదేరారు. బయలుదేరడమంటే అట్లా ఇట్లా కాదు మందీమార్బలంతోటి నేరుగా ప్రాజెక్టు మీదనే ప్రెస్మీట్ పెట్టారు. మేడిగడ్డలో మీరు చేసేదేం లేదు మీ సంగతి తేలుస్తా అంటూకేసీఆర్ సవాలు చేశారు. మొత్తం మీద రెండు పార్టీల హోరాహోరీకి రెడీ అవ్వడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయం రంజుగా మారిపోయింది. నువ్వు కృష్ణా ప్రాజెక్టులకు అన్యాయం చేస్తున్నావు.. అని కేసీఆర్అంటే.. నువ్వు గోదావరి ప్రాజెక్టుల్లో ఆల్రెడీ అన్యాయం చేసేశావ్ అని రేవంత్ అంటున్నారు. కృష్ణా జలాల్లో హక్కుల కోసం అని బీఆర్ఎస్ వాళ్లు మీటింగ్ తలపెడితే.. రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించి ఆ హక్కులకాలరాసింది మీరే అంటూ కాంగ్రెస్ వాళ్లు తగులుకుంటున్నారు.
ఫలితంగా డ్యాముల్లో నీళ్లకు బదలు నిప్పులు పారుతున్నట్లైంది పరిస్థితి. తెలంగాణ అస్థిత్వమే నీళ్లు పై ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలకు.. ఉద్యమానికిఇంధన వనరు…. ఈ నీళ్లే. అలాంటి నీళ్ల పంచాయతీ మళ్లీ మొదలైంది. అయితే ఈసారి ఇది పొరుగు రాష్ట్రంలో కాదు… నీళ్ల వాటాల్లో హక్కుల కోసం ఇన్నాళ్లు నడిచిన వివాదం.. ఇప్పుడు రాజకీయ ఆథిపత్యం కోసం ఇంటర్నల్గా నడుస్తోంది.పదేళ్లపాటు అప్రతిహతంగా అధికారాన్ని చెలాయించిన తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ కు మొన్నటి ఎన్నికల్లో తగిలిన షాక్తో దిగొచ్చింది. పార్టీ ప్రస్థానమంతా పోరాటాలు, ఉద్యమాలతో నడిచిన బీఆర్ఎస్, అప్పటి టీఆర్స్ పార్టీ వైఖరిలో అధికారం తర్వాత మార్పు వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఓ రాజకీయ పార్టీగా నిర్థిష్ట అజెండాతో వెళ్లడం ముందుకు సాగడం సరైందే అయినప్పటికీ… తెలంగాణ ప్రజలు ఆపంథాను అంగీకరించలేకపోయారని.. తెలంగాణ అనే పేరుకే దూరం కావడాన్ని కూడా ఆమెదించలేకపోయారన్న చర్చ నడుస్తోంది. జరిగిన నష్టాన్ని సరిచేయాలన్న తలంపుతో బీఆర్ఎస్ చాలా త్వరగానే పాత పంథాలోకి
వచ్చింది.
కొత్త ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని.. ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు- KRMB కు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఛలో నల్లగొండకు పిలుపునిచ్చింది.బీఆర్ఎస్
వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన ప్రభుత్వం KRMB విషయంలో అప్పటి ప్రభుత్వం తప్పు చేసిందని నిరూపించే ప్రయత్నం చేసింది. అప్పటి ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ తెలంగాణ ప్రాజెక్టులను యాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు అంగీకరిస్తూ లేఖ రాశారని బయటపెట్టింది. దానిని సరిదిద్దడానికే ప్రాజెక్టులను KRMB కి అప్పగించమనే తీర్మానం చేస్తున్నామని .. దీనికి బీఆర్ఎస్ సహకరించాలని చెప్పింది. దీంతోబీఆర్ఎస్ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. సభలో ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా ముప్పేట దాడి చేస్తుంటే.. హరీష్రావు ఒక్కరే ప్రతిఘటించారు. కృష్ణా ప్రాజెక్టులపై రాద్దాంతం చేస్తున్న బీఆర్ఎస్ రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించిందని కాంగ్రెస్ బాంబు పేల్చింది. రాయలసీమ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకూ కేసీఆర్ ఉద్దేశ్య పూర్వకంగా అపెక్స్ కమిటీ సమావేశానికి గైర్హాజరయ్యారని.. బయటపెట్టింది.
ప్రజల్లోమళ్లీ పరపతి పెరగాలంటే పోరాట పంథానే ముఖ్యం అనుకున్న బీఆర్ఎస్.. టీఆర్ఎస్ తరహాలో విజృంభించేందుకు సిద్ధమవుతోంది. ఆల్రెడీ దెబ్బతిన్న పార్టీని రెక్కలు విరచాలంటే.. వారి ఆయువుపట్టుపై కొట్టాలన్నట్లుగా రేవంత్ జోరు కనిపిస్తోంది. అందుకు కాళేశ్వరం కృంగిపోవడం కలిసొచ్చింది. మరి రేవంత్ అంత తేలిగ్గా వదులుతారా.. ? మొత్తం మీద రెండు పార్టీల రభస ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతోందో చెబుతోంది.