పారిశుధ్ధ్య కార్మికులు నిరసన బాట

సిరా న్యూస్,గుంటూరు.;

తమ సమస్యల పరిష్కారం కోసం పారిశుద్ధ్య కార్మికులు గత కొంతకాలంగా ఆందోళన బాట పట్టారు. చెత్త ఎత్తకుండా విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మున్సిపాలిటీలో, పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో ఈ ఆందోళన ఉధృతరూపం దాల్చింది. చెత్త పేరుకుపోతుండటంతో పట్టణాల్లో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి‌. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. చెత్త ఎత్తెందుకు ఇతర కార్మికులను పనిలోకి తీసుకొస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆందోళన బాట పట్టిన కార్మికుల చెత్త తరలించే వాహనాలను అడ్డుకుంటున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నివారించి పారిశుద్ద్యాన్ని మెరుగుపరిచేందుకు నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి రంగంలోకి దిగారు.పట్టణంలో టెంపరరీ కార్మికులతో కలిసి చెత్త ఎత్తుతున్నారు. మరి కొన్ని చోట్లు రోడ్లపై ఉన్న చెత్తను ఊడుస్తున్నారు. అంతేకాకుండా బ్లీచింగ్ చల్లడం, కార్మికులతో కలిసి డస్ట్ బిన్నులను డంపింగ్ యార్డ్‎కు తరలించడం చేస్తున్నారు. రెండు రోజుల నుండి ఉదయాన్నే రోడ్లపై ప్రత్యక్షమవుతూ టెంపరరీ కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఎమ్మెల్యేనే నేరుగా రంగంలోకి దిగడంతో మున్సిపల్ కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ట్రాక్టర్లను అడ్డుకోవడం, టెంపరరీ కార్మికుల విధులను అడ్డుతగిలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించడంతో మున్సిపల్ కార్మికులు మరింతగా భయపడుతున్నారు.ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే చెత్తను రోడ్లపై వేయవద్దంటూ నేరుగా ప్రజలకే విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించేవరకూ ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలంటున్నారు. టెంపరరీ కార్మికులకు పట్టణ వాసులు సహకరిస్తే అంటురోగాలు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చంటున్నారు. ఎమ్మెల్యే నేరుగా రంగంలోకి దిగడంతో పట్టణ వాసులు కూడా తమవంతుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *