సిరా న్యూస్, జైనథ్:
సాంగ్విలో ముగిసిన సప్తా వేడుకలు
+ ఘనంగా పల్లకి శోభాయాత్ర
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సాంగ్వి గ్రామంలో బాజీరావ్ బాబా సప్తా వేడుకలు సోమవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గీతాపారాయణం గావించారు. అనంతరం బాబా చిత్రపటాన్ని బంతిపూలతో అలంకరించిన పల్లకిలో ప్రతిష్ఠించి పుర వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అడుగడుగున పల్లకికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతావేశాధరణలో ఉన్న చిన్నారులను రథంపై కూర్చోబెట్టి పల్లకి వెంట నడిపించారు. మహిళలు మంగళ హారతులతో ముందుకుసాగగా, భక్తులు భజనలు, కీర్తనలు గావించారు. నృత్యాలు, కోలాటాలతో యువతీ, యువకులు శోభాయాత్రలో పాల్గొన్నారు. సర్పంచ్ విఠల్ రెడ్డి, స్థానిక నాయకులు, గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.