-రానున్న రథసప్తమినీ పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-ప్రత్యేకమైన సుగంధ ద్రవ్య పరిమళాలతో ఆలయ శుద్ధి
-కొలహలంగా పాల్గొన్న టి.టి.డి అధికారులు
సిరా న్యూస్,తిరుపతి;
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమినీ పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుధ్ధి నిర్వహించారు.
అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేంపల్లి శ్రీనివాసులు ఏ ఈ ఓ రమేష్, వీ.జీ.వో బాలిరెడ్డి ,విజిలెన్స్ వింగ్ ఏ.వీ.ఎస్.ఓ కళావతి ఏ.వీ.ఎస్.ఓ శైలేంద్ర బాబు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్, సూపరిండెండెంట్ శేషగిరి ,ఇన్స్పెక్టర్లు సుభాస్కర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.