సిరాన్యూస్, సైదాపూర్
ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి : మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. శనివారం రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని, ఆరుగాలం శ్రమించిన కర్షకులను ఆదుకోవాలంటూ రైతు దీక్ష పేరుతో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా హుస్నాబాద్ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతులకు మద్దతుగా నిర్వహిస్తున్న రైతు దీక్షలో సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తోందని మండిపడ్డారు.అన్నదాతల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయం చేయడం తప్ప, రైతులకు అండగా నిలబడటంలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. పంట నష్టపోయిన రైతులను పొలాల్లోకి అధికారులు గానీ, మంత్రులు గానీ చూసిన పాపాన పోలేదని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ విమర్శించారు.ఈ సందర్భంగా రైతులు పండించిన ప్రతి పంటకు క్వింటాలుకు 500రూపాయలు బోనస్ ఇవ్వాలని ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఎకరానికి రూ. 25,000/- ఇవ్వాలని అన్నారు. రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని, చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.