సిరాన్యూస్, హుస్నాబాద్
హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
* రైతులు అధైర్యపడవద్దు అండగా ఉంటాం
పేదలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు ఓడితెల సతీష్ కుమార్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతుల పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల హామీలు భాగంగా అన్ని రకాల వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద నీతిని నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా పోరాడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.