సిరా న్యూస్, చిగురుమామిడి:
ఆటో డ్రైవర్లకు రూ. 3 వేల జీవనభృతి అందించాలి…
ఆటో డ్రైవర్లకు రూ. 3 వేల జీవనభృతి అందించి, ఆదుకోవాలని ధర్మ సమాజ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల తహసిల్దార్ ఇప్ప నరేందర్ కు ఈ మేరకు లిఖితపూర్వకంగా వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేయడంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో, గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తింపచేయాలని, దీని వలన ఆర్టీసీపై భారం తగ్గుతుందని అన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకులు తాళ్ల నరేష్, జిల్లేల సురేష్, అందే సాగర్, కొంకట హరీశ్, రాజ్ కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.