సిరా న్యూస్,హైదరాబాద్;
వర్షాకాలం అంటే అందరికీ వెన్నులో వణుకే…ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వచ్చామంటే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. నాలాలు, మ్యాన్హోల్స్, విద్యుత్ స్తంభాలు, ప్రహరీలు, సెల్లార్ గుంతలు, కరెంట్ తీగలు, కూలిపోయే చెట్లు ఇలా ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. ఈ జాబితాలో హోర్డింగ్స్లు వచ్చి చేరాయి. గ్రేటర్లో వాణిజ్య ప్రకటనల కోసం ఏర్పాటు చేసే బోర్డులు 15 ఫీట్లకు తగ్గకుండా ఉండాలి. కానీ చాలా చోట్ల కొందరు అధికారుల ప్రమేయంతో నిబంధనలను ఉల్లంఘించి..హోర్డింగ్ల ఎత్తు పెంచినట్లు అరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో కారిడార్ లక్ష్యంగా సికింద్రాబాద్, హైటెక్ సిటీ ఇతర ప్రాంతాల్లో 15 ఫీట్లకు మించి హోర్డింగ్లు ఉండటం, ఈ క్రమంలోనే బలహీనమైన ఫ్లెక్సీలు చిరిగిపోయి వాహనదారులను, కరెంట్ స్తంభాలను కప్పేస్తున్నాయి. బలమైన ఈదురుగాలులతో హోర్డింగ్లు, కొట్టుకొస్తున్న ఫ్లెక్సీలతో స్థానికులతో పాటు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో ఫ్లెక్సీలు విద్యుత్ తీగలపై పడుతుండటంతో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదని టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు చెబుతుండటం ఇందుకు నిదర్శనం.నగరంలో ఏర్పాటు చేసే హోర్డింగ్స్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలిగించకుండా ఉండేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. వ్యాపార ప్రకటనతో పాటు హోర్డింగ్ సామర్థ్యం పరీక్షించి సర్టిఫికెట్ను జారీ చేయాలి. కానీ ఆ దిశగా తనిఖీలు జరగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 15 మీటర్ల వరకు ఉన్న హోర్డింగ్లు సైతం పక్కాగా.. నిబంధనల ప్రకారం నడపాల్సిన చోట సదరు ఏజెన్సీలు మెట్రో పిల్లర్లే లక్ష్యంగా అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ధనార్జనే ధ్యేయంగా హోర్డింగ్ల ఏర్పాటు చేస్తూ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు.ఈ తరహా సర్దార్ పటేల్ రోడ్ (శివాజీనగర్), సైబర్ సిటీ టవర్, శిల్పారామం రోడ్ ఇలా కొన్ని చోట్ల అర్ధరాత్రి పూట వయా డక్ట్ హోర్డింగ్ పనులు జరుపుతున్నారు. ఈ పనులను పర్యవేక్షించే అధికారులు లేరు. ప్రమాదకర స్థాయిలో ఈ పనులు జరుగుతున్నాయన్న అరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బలహీనమైన ఫ్లెక్సీలతో ఇబ్బందులు వస్తున్నాయని గ్రేటర్ విద్యుత్ అధికారులు చెబుతున్నారు. కరెంట్ తీగలపై ఫ్లెక్సీలు పడుతుండటంతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నదని, ప్రమాదకర హోర్డింగ్ల పట్ల అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.