జూన్ 10 నాటికి మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పని చేయాలి
ప్రతి ప్రభుత్వ పాఠశాల సంపూర్ణ నమూనా రూపోందించాలి
అమ్మ ఆదర్శ కమిటీలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలి
జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్
సిరా న్యూస్,పెద్దపల్లి;
ప్రభుత్వ పాఠశాల పరిస్థితులను మెరుగుపరచడానికి పిల్లలకు మెరుగైన విద్య అందించడానికి అమ్మ ఆదర్శ కమిటీలు సకాలంలో పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధి పనులపై మహిళా సంఘాలు సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్థానిక మహిళా సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇకపై అమ్మ ఆదర్శ కమిటీలు పాఠశాలల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయని, ప్రధానోపాధ్యాయులు , స్థానిక గా మహిళా సంఘం సభ్యులు కలిసి అమ్మ ఆదర్శ కమిటీలుగా రూపొందించామని అన్నారు. ప్రతి పాఠశాలలో ఉన్న ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులను ఎంపిక చేసి ఆదర్శ మహిళ కమిటీలో చోటు కల్పించడం జరుగుతుందని, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలికి, ప్రధానోపాధ్యాయులకు జాయింట్ చెక్ పవర్ తో అమ్మ ఆదర్శ కమిటీలు ప్రత్యేక బ్యాంకు ఖాతాను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు నిర్ణయం తీసుకున్నమని, పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే తప్పనిసరిగా బాలికల టాయిలెట్లు, బాలుర టాయిలెట్లు, త్రాగు నీటి సరఫరా , తరగతి గదిలో ఉన్న మైనర్ రిపేర్లను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను సంబంధిత అమ్మ ఆదర్శ కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులను గుర్తించాలని, వాటికి ప్రతిపాదనలు రూపొందించి జూన్ 10 నాటికి మౌలిక వస్తువుల కల్పన పనులు పూర్తయ్యే విధంగా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాల యొక్క నమూనాను ముందస్తుగా ఒక కాగితం పై రూపొందించుకోవాలని, పాఠశాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని, పాఠశాలలో ఉన్న ఓపెన్ గ్రౌండ్, ఆట స్థలాలు డిస్ట్రబ్ చేయకుండా నూతన భవనాల నిర్మాణం ప్రణాళిక ఉండాలని కలెక్టర్ సూచించారు. మహిళా సంఘాలు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పాఠశాల అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలని, ఒక పాఠశాల నిర్మాణ పనులను అధికారులు పూర్తి చేసి మహిళా సంఘాలకు డెమో లా వివరిస్తారని కలెక్టర్ తెలిపారు. మన పిల్లలు చదువుకునే పాఠశాలలో అత్యంత శ్రద్ధ వహించి మౌలిక వస్తువుల కల్పన పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా చూడాలని కలెక్టర్ కోరారు. అమ్మ ఆదర్శ కమిటీల వద్ద 25 వేల రూపాయల నిధులు అందుబాటులో ఉంటాయని, వీటిని ఎటువంటి అనుమతి లేకుండా పాఠశాల కోసం ఖర్చు చేయవచ్చని, 25 వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు పనులను స్థానిక ఎంపిడిఓ, లక్షకు పైగా ఖర్చుతో కూడుకున్న పనులను జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు. పాఠశాల అభివృద్ధి , మౌలిక వసతుల కల్పనకు సంబంధించి నిధులకు ఎటువంటి కొరత లేదని, పనులు జరిగిన వెంటనే సంబంధిత బిల్లులను జిల్లా స్థాయిలో క్లియర్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు యూనిఫామ్ సైతం మహిళా సంఘాలలో టైలరింగ్ ప్రావీణ్యం ఉన్న వారిచే కుట్టించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డీ. మాధవి, జిల్లా పంచాయతీ అధికారి ఆశలత, డిఆర్డిఓ రవీందర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
=======================