అక్రమంగా నిలువ ఉంచిన బొగ్గు స్వాధీనం

 సిరా న్యూస్,మంథని;
పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాల గ్రామంలో సుమారు 200ల క్వింటాళ్ల నిల్వ ఉన్న బొగ్గు ను విజిలెన్స్, ఎస్ అండ్ పిసి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కన్నాల గ్రామంలోని ఇటుకల బట్టి వద్ద మంగళవారం ఉదయం అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసారు. కొన్ని బొగ్గు నిలువలతోపాటు, బొగ్గును అన్లోడ్ చేయడానికి వచ్చిన రెండు లారీలను సీజ్ చేశారు. ప్రతిరోజు భూపాలపల్లి బొగ్గు గని ఓసి 3 నుండి గోదావరిఖని ఓసి 1 కు బొగ్గును సరఫరా చేస్తారు. ఈ క్రమంలో లారీలలోని బొగ్గును పూర్తిగా డంపు చేయకుండా తిరిగి వెళ్లే క్రమంలో కన్నాల గ్రామంలోని ఇటుకల బట్టి వద్దకు వచ్చి డంపు చేస్తున్నారు. అనుమానం వచ్చిన అధికారులు గత 5 రోజులుగా రెక్కీ నిర్వహించారు. ఈరోజు ఉదయం అధికారులు బొగ్గు నిల్వలను, లారీలను పట్టుకొని సీజ్ చేశారు. ఇటుకల బట్టి యజమాని లారీలలో నుండి రోజున సరాసరి 25 నుంచి 30 టన్నుల బొగ్గును అక్రమంగా దించుకుంటూ, తన ఇటుకల బట్టికి వాడుతున్నారని నిర్ధారించారు. అదేవిధంగా నాణ్యమైన బొగ్గును లారీలలో నింపి ఇతర ప్రాంతాలకు అధిక ధరకు అమ్ముకుంటున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *