ఎమ్మెల్యే సబితా అనుచరగణం ఆరాచకాలపై ఆవేదన
కష్టకాలంలో పార్టీని కేఎల్ఆర్ నిలబెట్టారు- కాంగ్రెస్ నేతలు
సొంతగూటికి సీనియర్లు రావటం సంతోషం- కేఎల్ఆర్
సిరా న్యూస్,రంగారెడ్డి;
కందుకూర్ మండలం జైత్వారం, బాచుపల్లి గ్రామాల నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ నాయకులు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.. తుక్కుగూడ నివాసంలో కండువాలు కప్పుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో హస్తం పార్టీని ముక్కలుగా చేసి… కారెక్కిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై పార్టీ సీనియర్ నాయకులు మండిపడ్డారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేఎల్ఆర్ పోటీ చేసి క్యాడర్ ను నిలబెట్టారని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ… గతంలో బీఆర్ఎస్, బీజేపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు మళ్లీ తిరిగి సొంతగూటికి రావటం సంతోషం అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రోజూ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. గ్రీవెన్స్ కోసం వచ్చే బాధితుల్లో ఎక్కువ మంది సబితమ్మ అనుచరగణం బాధితులే ఉన్నారని చెప్పారు. సమస్యలను పరిష్కరించకుండా చిక్కుముడులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని కేఎల్ఆర్ మండిపడ్డారు.
బాచుపల్లి నుంచి వెంకటేశ్, జైత్వారం నుంచి మహేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని కేఎల్ఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణానాయక్, జంగారెడ్డి, సత్యనారాయణ సహా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.