సిరాన్యూస్, హుస్నాబాద్:
ప్రయివేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: డీవైఎఫ్ఐజిల్లా అధ్యక్షుడు శివరాజ్
* ప్రయివేట్ పాఠశాలల ఎదుట ధర్నా
విద్యను వ్యాపారం చేస్తున్న ప్రవేట్ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా విద్యార్థులకు అధిక ధరలకు పాఠ్య పుస్తకాలను విక్రయిస్తున్న పలు ప్రయివేట్ పాఠశాలల కేంద్రాల ఎదుట డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మండల విద్యాధికారికి సమాచారం అందివ్వగా అధికారులు వచ్చి పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్న కేంద్రాలను తనిఖీ చేసి వాటిని సీజ్ చేశారు. బయట బుక్ స్టాల్లల్లో పాఠ్యపుస్తకాలు కాకుండా, కేవలం పాఠశాలలు అందిస్తున్న పాఠ్యపుస్తకాలనే కొనాలని నిబంధనలు పెట్టి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక ధరలకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నాయని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ మండి పడ్డారు. విద్యార్థులకు యూనిఫామ్ నుంచి మొదలు పెడితే పాఠ్య పుస్తకాల వరకు ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తున్న విద్యాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజులు, అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రాజు నాయక్, విద్యార్థి నాయకులు రవీందర్, సంపత్, అరవింద్, ఠాకూర్, సాయి, చరణ్, తదితరులు పాల్గొన్నారు.