తెలంగాణ నుంచి సింఘ్వీ

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో రాజ్యసభ సీటు ఎవరికి దక్కనుంది? తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు ఆ సీటు ఇస్తారా? లేకా సీనియర్లకు ఇస్తారా? ఇదే చర్చ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మొదలైంది. రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు రాజీనామా చేయడంతో ఆ సీటు ఎవరికి ఇస్తారన్న దానిపై నేతలు చర్చించుకోవడం మొదలైంది.తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడవాళ్లకు సీటు ఇవ్వడం ఖాయమన్నది కొందరి నేతల వాదన. కానీ ఈ సీటును పార్టీలోని కీలక నేతకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏఐసీసీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్‌మను సింఘ్వీకి ఆ సీటు ఇవ్వడం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి.పార్టీ హైకమాండ్ ఆయనకు దాదాపుగా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో అభిషేక్ మనుసింఘ్వీ అనుకోకుండా ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను మరో చోట నుంచి పెద్దల సభకు పంపాలని భావిస్తోంది. ఈ సమయంలో బీఆర్ఎస్ నుంచి కేశవరావు కాంగ్రెస్‌లోకి వచ్చారు. కేకే రూపంలో సింఘ్వీకి అదృష్టం కలిసి వచ్చిందని అంటున్నారు.ఇప్పటికే కేకే తన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్‌కు అందజేశారు. ఒక పార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేయడం నైతిక బాధ్యతను ఆ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత కేశవరావుకు కేబినెట్ హోదాతో కూడిన ప్రత్యేక సలహాదారు పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సూచన ప్రాయంగా చెప్పినట్టు తెలుస్తోంది.
సీక్రెట్ ఆపరేషన్ లో రేవంత్
సెంబ్లీ బడ్జెట్ సమావేశాలనాటికి ఎమ్మెల్యేల బలం పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా పథకాలు రచిస్తోంది. అందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ బీఆర్ఎస్ ను మానసికంగా బలహీనంగా మార్చేస్తోంది. కనీసం ఆ పార్టీ నుంచి ఎవరెవరు కాంగ్రెస్ లో చేరుతున్నారో కూడా తెలియనీయకుండా..లీకులకు బ్రేకులు వేసి మరీ చేర్చుకుంటోంది. సొంత పార్టీ నేతలే ఒకరిని ఒకరు అనుమానాస్పదంగా చూసుకునే పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్ కు. అసలేం జరుగుతోందో తెలియని డైలమాలో ఉంది ఆ పార్టీ క్యాడర్ మొత్తం. ఇలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్కు మరో భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్‌లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా కూడా హడావుడి లేకుండా, ఎలాంటి ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఎమ్మెల్సీల చేరిక జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్‌ కండువాలు కప్పుకొన్నారు. ఆ సమయంలో సీఎం రేవంత్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాసు మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు ఉన్నారు.ఇకపై కంటిన్యూగా జాయినింగ్స్ ఉంటాయని టీపీసీసీకి చెందిన నేతలు చెబుతున్నారు.. తమ టార్గెట్ 25 మంది ఎమ్మెల్యేలని, ఇప్పటికే ఆరుగురు చేరగా, త్వరలో మిగతా వారంతా చేరుతారని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో కలుపుకుంటే ప్రస్తుతం అధికార పార్టీ సభ్యుల సంఖ్య 71కి చేరుకుంది. కాగా తెలంగాణ శాసన మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. ప్రస్తుతం 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు ఆరుగురు మాత్రమే సభ్యులు న్నారు. తాజాగా ఆరుగురు సభ్యులు చేరడంతో వారి బలం 12కు చేరింది. వామపక్ష ఎమ్మెల్సీ మద్దతుతో కలిపితే 13కు చేరుతుంది. కాంగ్రెస్ పార్టీకి మరో ఐదారు సీట్లు ఉంటే మండలిలో కూడా మెజారిటీ దక్కుతుంది. ప్రస్తుతం తెలంగాణ మండలిలో బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. కీలక బిల్లులను నెగ్గించుకునే రేవంత్ ప్రభుత్వం ఇబ్బందులు లేకుండా ముందుకు సాగే వీలుంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్, దండె విఠల్, ఎం.ఎస్‌ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్‌ పార్టీ మారారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ సమావేశమైన వారు రాత్రి 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హస్తిన పర్యటన ముగించుకుని ఇంటికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం చకచకా పూర్తవడం గమనార్హం.
=============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *