ఇతర రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతులు
సిరా న్యూస్,కోనసీమ;
అదిరిపోయే వివాహాది శుభముహూర్తాలు.. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రావణ శుక్రవారం వ్రతాలు.. దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించే స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ఇవన్నీ ఒకేసారి వస్తే పువ్వులకు ఉండే డిమాండ్ మాటల్లో చెప్పలేము. ప్రస్తుతం అదే జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్ అమ్మకం, కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. అదేవిధంగా కోనసీమ జిల్లాలో రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు కొత్తపేట ప్రాంతాల్లో పూల సాగు అధికంగా ఉంటుంది .ప్రస్తుత సీజన్లో పూల దిగుబడులు అంతగా ఉండవు. ఇటీవల వచ్చిన వరదలకు కూడా పూల తోటలో దెబ్బతిన్నాయి. అందుకనే కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉండే బంతి, చామంతి, గులాబీ వంటి రకాలను టన్నులు కొలది ఈ మార్కెట్ కు దిగుమతి చేసుకున్నారు. అలాగే వివాహాది శుభకార్యాలకు కావలసిన డెకరేషన్ పువ్వులను బెంగళూరు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఈ మార్కెట్ కు తీసుకువచ్చారు. గురువారం స్వతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు బలమైన వివాహ ముహూర్తం ఉండడంతో ఈ పూలకు ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. అంతేగాక శ్రావణ శుక్రవారం కు అవసరమైన పూల కొనుగోలుకు కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల నుంచి కొనుగోలుదారులు వచ్చి పూలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. అలాగే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి కొనుగోలుకు వ్యాపారంలో తరలివచ్చారు. అంతేగాక ఆర్డర్లపై స్థానిక పూల వ్యాపారులు ఆర్టీసీ బస్సులు ద్వారా ఎగుమతులు చేపట్టారు.
ఇటీవల వచ్చిన వరదలు వల్ల కడియం, ఆలమూరు,ఆత్రేయపురం మండలాలలో లంక ప్రాంతాల్లో సాగయ్యే కనకాంబరం, లిల్లీ, మల్లి, జాజులు, గులాబీ వంటి పూల పంటలకు నష్టం వాటిల్లింది. అందువల్ల ప్రస్తుత సీజన్లో వాటి ధరలు మరింత అధికమయ్యాయి. బుధవారం కడియపులంక పూల మార్కెట్లో పూల ధరలు ఈ విధంగా ఉన్నాయి.గురువారం ఉదయం నుంచి అదే ధరలు పలుకుతున్నాయి. చామంతి కేజీ రూ.250, వైట్ చామంతి రూ.300,బంతి రూ.50 నుంచి 80, కనకాంబరాల బారు రూ. 300 నుంచి 450, గులాబీ రూ.180, జాజులు రూ.1200, లిల్లీ రూ. 500, మల్లి రూ. 1500,హైబ్రిడ్ గులాబీ కట్ట రూ.250 పలికాయి.