SP Goush Alam: శాంతి భద్రతల పరిరక్షణలో డయల్ – 100 సేవలు కీలకం :  ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
శాంతి భద్రతల పరిరక్షణలో డయల్ – 100 సేవలు కీలకం :  ఎస్పీ గౌష్ ఆలం
* సంఘటన స్థలాలకు వీలైనంత త్వరగా చేరుకోవాలి
* పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరగాలి

శాంతి భద్రతల పరిరక్షణలో డయల్ – 100 సేవలు కీలకమ‌ని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. ఆపదలో ఉన్న ప్రజలకు తక్షణమే సహాయ సహకారాలు అందించే సదుద్దేశంతో ప్రారంభించబడిన డయల్ 100 సేవల నిర్వహణ పై ఏర్పాటు చేయబడిన వీడియో సమావేశం లో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ పాల్గొని సిబ్బందికి సూచనలు చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నందు గల సమావేశ మందిరంలో జిల్లాలోని పోలీసు స్టేషన్ల అధికారులు సర్కిల్ అధికారులు డిఎస్పీలు, డయల్ 100 విధులను నిర్వర్తించే సిబ్బంది బ్లూ కోర్ట్ పెట్రో కార్ సిబ్బందికి డయల్ 100 ద్వారా చేయవలసిన విధులు, పాటించవలసిన విషయాలపై మార్గదర్శకం చేశారు. ప్రజలలో శాంతిభద్రతలను కాపాడటంలో సమస్యలతో ఉన్న ప్రజలకు అతి త్వరగా పరిష్కారం అందించే దిశగా డయల్ 100 విధులను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ముఖ్యంగా డయల్ 100 కాల్ వచ్చినప్పటినుండి త్వరగా సంఘటన స్థలాలకు చేరుకునేంతవరకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత బాధితులకు న్యాయం చేకూరే విధంగా విచారణ చేపట్టాలని, సమస్య పెద్దదైతే ఉన్నతాధికారులకు సమాచారం అందించి స్టేషన్ సిబ్బందిని వినియోగించుకొని సమస్యను పూర్తి చేయాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అతి తక్కువ సమయం లో సంఘటనా స్థలాలకు చేరుకునేలా రికార్డులను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. సిబ్బంది విధులను పోలీస్ స్టేషన్ ముఖ్య అధికారులు ప్రతిరోజు పర్యవేక్షిస్తుండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి ఆపరేషన్ బి సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సిహెచ్ నాగేందర్, పట్టణ సీఐలు, ఎస్సైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *