సిరా న్యూస్,ఆదిలాబాద్
మాదకద్రవ్యాల కేసులలో పరిశోధన కీలకం: ఎస్పీ గౌష్ ఆలం
* ప్రత్యేక పీపీ రమణారెడ్డి ద్వారా జిల్లా పోలీసు సిబ్బందికి శిక్షణ
మాదకద్రవ్యాల కేసులలో పరిశోధన కీలకంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. మాదకద్రవ్యాల కేసులలో మరింత పరిజ్ఞానాన్ని, పరిశోధనలు పెంపొందించేందుకు జిల్లా ప్రత్యేక పీపీ ముస్కు రమణారెడ్డి ద్వారా శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సిబ్బంది అందరికీ దర్యాప్తు పరిశోధన పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాదకద్రవ్యాలపై కేసులు చేసేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు చార్జిషీటు దాఖలు చేసేటువంటి అధికారులకు, స్టేషన్ రైటర్లకు పూర్తి అవగాహనను కల్పించేందుకు ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మాదక ద్రవ్యాల కేసులలో ముఖ్యంగా పరిశోధన ఎలా చేయడం, కేసు నమోదు ఏ ఏ పరిస్థితులను బట్టి చేయడం, దర్యాప్తు నిర్వహించి చార్జిషీట్ దాఖలు చేసే సమయంలో తీసుకోవలసిన పద్ధతులపై అవగాహన కల్పించారు. దర్యాప్తు పక్కగా నిర్వహించి పూర్తి నివేదికను చార్జిషీట్ నందు దాఖలు చేసినప్పుడే నేరస్తులపై కఠినమైన చర్యలు తీసుకొని సరైన శిక్షలు పడతాయని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా శాలువా, బహుమతితో సత్కరించారు. ఎటువంటి సందేహాల కైనా, సమస్యలకైనా తనను సంప్రదించవచ్చని ప్రత్యేక పీపీ ముస్కు రమణారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పి ఆపరేషన్ బి సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు, ఎస్సైలు, స్టేషన్ రైటర్స్, ఐటి కోర్, డిసిఆర్బి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.