సిరాన్యూస్, ఆదిలాబాద్
అత్యవసర సమయాల్లో తప్ప బయటికి రాకూడదు: ఎస్పీ గౌష్ ఆలం
* రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు
* లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* జిల్లా పోలీసు యంత్రంగా పూర్తి అప్రమత్తత
* అత్యవసర సమయంలో డయల్ 100, పోలీసులను సంప్రదించాలి
* 24 గంటలూ అందుబాటులో నూతన డీడీఆర్ఎఫ్ బృందం
అత్యవసర సమయాలలో తప్ప బయటికి రాకూడదని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు రాష్ట్ర వాతావరణ శాఖ (రెడ్ అలర్ట్) సూచించిన దృష్ట్యా జిల్లా ప్రజలకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం సూచనల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా పోలీసు అధికారులు ఎల్లవేళలా అప్రమత్తతతో విధులను నిర్వర్తిస్తుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రత్యేక టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి జిల్లా పోలీసు అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు అత్యవసర సమయాలలో తప్ప బయటకి రాకూడదని సూచించారు. ఎటువంటి సమస్యలు ఉన్న అత్యవసర సమయంలో డయల్ 100 కు లేదా జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలు అత్యవసర సమయంలో స్పందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని, ప్రజలు 08732-226246, 8712659906 నంబర్కు సంప్రదించగలరని లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని సూచించారు. నూతనంగా శిక్షణ తీసుకున్న డీడీఆర్ఎఫ్ బృందం జిల్లాలో 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడతారని తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని పోలీస్ స్టేషన్లలో అప్రమత్తతతో ఉంటుందని తెలిపారు. జలాశయాలు, చెరువులు, వాగుల వద్ద మత్స్యకారులు, ప్రజలు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. వర్షం భారీగా ఉన్నప్పుడు పొలాలలో రైతులు విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాకకుండా ఉండాలని సూచించారు. చెట్ల కింద, పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల పక్కన ఉండకుండా చూడాలి. ముఖ్యంగా విద్యార్థులు, పిల్లలు పాత భవనాలలో ఉండకుండా చూడాలని తెలిపారు. వాహనదారులు రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, నీటి ప్రవాహం, వర్షం వల్ల ఏర్పడిన గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉందని, సిబ్బంది అలాంటి ప్రదేశాలలో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.