సిరా న్యూస్,హైదరాబాద్;
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలుచేసేందుకు వీలుగా 2024-25వ ఏడాదికి బడ్జెట్ను రూపకల్పన చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు తీర్చే విధంగా వాస్తవికతతో కూడిన బడ్జెట్ను రూపొందించే పనిలో అధికారులు బిజీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులకే పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారని, సిఎం హామీలను యుద్దప్రాతిపదికన అమలు చేయాల్సి ఉందని, పైగా ఈ ఏడాదిలోనే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసే బృహత్తర కార్యక్రమం ముందున్నందున, బడ్జెట్ రూపకల్పనలో ఎన్నో ఛాలెంజెలను దృష్టిలో పెట్టుకొని కసరత్తులు చేస్తున్నామని వివరించారు.ఒకవైపున కేంద్ర ప్రభుత్వం రానున్న ఆర్ధిక సంవత్సరానికి ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతోందని, అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా ఉండబోతున్నాయి, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎన్ని వస్తాయి?, ఆ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనే అంశాలపై ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉందని ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడితే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దగా నిధులను కేటాయింపులు చేయకుండా కేవలం ప్రభుత్వ ఖర్చులకు, పాలనాపరమైన అవసరాలకు మాత్రమే నిధులను కేటాయించి కేంద్రం చేతులు దులుపుకునే అవకాశాలు కూడా ఉన్నాయని, మరలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం ఆశలు పెట్టుకోవడం వృధా ప్రయాసే అవుతుందని మరికొందరు అధికారులంటున్నారు.అయినప్పటికీ అన్ని ప్రభుత్వ శాఖలకు మాత్రం 2024-25వ ఆర్ధిక సంవత్సరానికి అవసరమైన నిధులపై ప్రతిపాదనలు ఇవ్వాలని కోరామని, అదికూడా ఏడాదికి సరిపడా బడ్జెట్ ప్రతిపాదనలు ఇవ్వాలని కోరామని వివరించారు. అందుకు తగినట్లుగా ఆయా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధంచేసే పనిలో ఉన్నారని వెల్లడించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందున… ఎలాగూ కేంద్ర ప్రాయోజిత పథకాలకు పెద్దగా నిధుల కేటాయింపులు కూడా ఉండకపోవచ్చునని, ఒకవేళ కేటాయింపులు చేసినా అవి గరిష్టంగా ఆరు నెలలకే పరిమితంగా ఉండవచ్చునని, అందుచేతనే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ను ఏడాదికి సరిపడా ప్రవేశపెడితేనే సత్ఫలితాలు ఉంటాయని కొందరు సీనియర్ అధికారులంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వస్తున్న ఆదాయాన్నే దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 2024-25వ ఆర్ధిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ను రూపొందించాల్సి ఉంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ప్రస్తుతమున్న ఆదాయం సుమారు 2.60 లక్షల కోట్ల రూపాయలని, ఎఫ్ఆర్బిఎం పరిమితిని మరో 0.5 శాతం పెంచుకోగలిగితే అదనంగా సుమారు 20 వేల కోట్ల రూపాయల నిధులు ఖజానాకు వస్తాయని, అదే జరిగితే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేయడానికి ఆర్ధికపరమైన ఇబ్బందులేమీ ఉండవని, సాఫీగా గ్యారెంటీలన్నీ అమలు చేయవచ్చునని ఆ అధికారులు ధీమాగా చెబుతున్నారు.